Wednesday, April 17, 2024

అభివృద్ధి పనులకు శంకుస్థాపన…

పటాన్‌చెరు : అమీన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధిలోని కాలనీలలో మౌళిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌ పరిధిలోని కావేరి హోమ్స్‌, కేజీ ఆర్‌ సర్కిల్‌, బాలాజీ నగర్‌ కాలనీలలో కోటి యాభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీరోడ్ల పనులకు స్థానిక మున్సిపల్‌ చైర్మన్‌ పాండురంగారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన అమీన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధిలోని ప్రతి కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తున్నుట్లు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మల పాండు రంగారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరి భాగస్వామ్యంతో, జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సహాయ సహకారాలతో అమీన్‌పూర్‌ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.
టీఆర్‌ఎస్‌లో యువకుల చేరిక..
టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు వడ్ల కాల ప్ప నేతృత్వంలో మండే మార్కెట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో అమీన్‌పూర్‌కి చెందిన 50 మంది యువకులు, క్రీడాకారులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పథకాల పట్ల ఆకర్షితులై టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడం శుభపరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నరసింహాగౌడ్‌, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో అప్షన్‌ సభ్యులు, టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement