Friday, April 26, 2024

మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి వేడుకలు..

మెదక్‌ :కుల వివక్షతకు వ్యతిరేకంగా సమసమాజ నిర్మాణం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక దార్శినికుడు మహాత్మాజ్యోతిరావుపూలే అని జిల్లా కలెక్టర్‌ యస్‌. హరీష్‌ అన్నారు. వర్ణ వివక్షతను రూపుమాపడం కోసం దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం శ్రమించిన తీరు, వారు ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని కొనియాడారు. పూలే 195వ జయంతి సందర్బంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డిఆర్‌డిఓ శ్రీనివాస్‌, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్‌, బి.సి సంక్షేమాధికారి జగదీశ్వర్‌, జిల్లా బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు మెట్టు గంగారాం, ప్రధాన కార్యదర్శి గుండు మల్లేశం, కార్యదర్శి సిద్దిరాములు, బిసి సంఘం నాయకులు, హాస్టల్‌ వార్డెన్లు, సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు.
పెద్దశంకరంపేటలో..
పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ప్రజాసంఘాల కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావుపూలే 195వ జయంతి వేడుకలను భీమ్‌ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీమ్‌ఆర్మీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంగమేశ్వర్‌ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభివృద్దికి కృషి చేసిన మహానీయుడు, బడుగు వర్గాల హక్కుల కోసం పోరాడిన సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావుపూలే అని, ఆయన చూపిన అభ్యుదయ మార్గంలో మనమంతా నడవాలని ఆయన ఆశయ సాధన కోసం ఎల్లప్పుడు కృషి చేయాలన్నారు. 18వ శతాబ్దంలోనే త న భార్యకు విద్యను అందించి మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన మహానీయుడు జ్యోతిరావుపూలే అన్నారు. ఈ కార్యక్రమంలో వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మెదక్‌ జిల్లా అధ్యక్షులు తుకారం, వీఆర్‌వో రమేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు అరుణ్‌భీమ్‌, ఆర్మీ నాయకులు కుమార్‌ శ్రీరామ్‌, పవన్‌, మైసయ్య, అంబేద్కర్‌ యువజన సంఘం నాయకులు నాని, సురేష్‌, పర్వయ్య, పాల్గొన్నారు.
కొల్చారంలో..
సమాజంలో కులపరమైన వివక్షతను అన్యాయాలను రూపుమార్చడానికి తన జీవితాన్ని దారపోసిన మహాత్మా జ్యోతిరావుపూలే జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్‌ జిల్లా కార్యదర్శి మరెల్లి అనిల్‌, నాయకులు ఏవాస్‌ డైరెక్టర్‌ జీవయ్య, వార్డు సభ్యులు భూమయ్య, షాదుల్లా , గ్రామస్తులు అసృప్‌, సురేష్‌, రాజు పాల్గొన్నారు.
రామాయంపేటలో..
మహాత్మ జ్యోతిరావుపూలే 195వ జయంతి సందర్భంగా రామాయంపేటలోని పూలే దంపతుల విగ్రహాల సన్నిదిలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సావిత్రిబాయి పూలే మహిళా సంఘం మెదక్‌ జిల్లా అధ్యక్షురాలు అశ్విని శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులవివక్షతను రూపుమాపి యువకులలో ఆత్మస్తైర్యాన్ని నింపి ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకొని స్పూర్తిని నింపిన మహానీయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దామోదర్‌ శివరాములు, నరేందర్‌, గిరి, మధుసూధన్‌, విజయేందర్‌, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
హవేళిఘణపూర్‌లో..
మండల పరిధిలోని శమ్నాపూర్‌ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాత్మాజ్యోతిరావుపూలే 195వ జయంతిని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గ్రామంలో కూలీలకు లేబర్‌ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె. మల్లేశం మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావుపూలే సామాజిక సేవ చేయడంలో మహాత్మ అయ్యాడని గుర్తు చేశారు. అంటరాని తనానికి స్వస్థి పలకాలని నాటి నుండి నేటి వరకు అంటరానితనం నిర్మూలించడానికి కృషి చేశారు. ఆయన కన్న కళలు సాధన కోరకు మేము సైతం ఉద్యమిస్తామని జయంతి సందర్భంగా జయంతి సభలో జరుపుతూ శమ్నాపూర్‌ గ్రామంలో కూలీలకు లేబర్‌కార్డు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భీమేష్‌, కొమురయ్య, పోచయ్య, రాములు, మల్లయ్య, దుర్గయ్య, సామయ్య, మనీషా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement