Thursday, April 18, 2024

డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం..

మెదక్ : పేదోడి సొంత ఇంటికళ నిజం చేసేందుకే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. డబుల్‌బెడ్‌రూమ్‌ల ఇళ్ల నిర్మాణం మెదక్‌ జిల్లాలో కాస్త నత్తనడకన నడుస్తున్న మాట వాస్తవమే. జిల్లాలోని కొన్ని మండలాల్లో స్థల సేకరణ పూర్తి కూడా కాలేదు. దీంతో లబ్దిదారులకు ఇళ్లు వస్తుందోలేదో అనే అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకెన్నాళ్లు వేచి చూడాల్సి వస్తుందోనని లబ్దిదారులు బెంబెలెత్తుతున్నారు. మెదక్‌ జిల్లాలో ప్రభుత్వం 5,235 డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు మంజూరు చేసింది. ఇప్పటికే 15వందల డబుల్‌బెడ్‌రూమ్‌లు ప్రారంభోత్సవానికి నోచుకున్నాయి. ఆరేళ్లలో కేవలం పాపన్నపేట, హవేళిఘనపూర్‌, చిన్నశంకరంపేట మండలాల్లోనే ప్రారంభోత్సవానికి నోచుకున్నాయి. ఇంకా 15 మండలాల్లో 3,735డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం జరగాల్సి ఉంది. కానీ ఏ మండలంలో కూడా పూర్తిస్థాయి పనులు జరగడంలేదు. అంతేకాకుండా టేక్మాల్‌, రేగోడ్‌, అల్లాదుర్గం మండలాల్లో స్థల సేకరణ జరగలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ నిర్మాణం పనులు పూర్తికాకపోవడంతో లబ్దిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియని పరిస్థితిలో లబ్దిదారులు ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత ఎమ్మెల్యేలు స్పందించి ఇకనైనా డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు వేగవంతం చేసి లబ్దిదారులకు అందించాలని వారు కోరుతున్నారు. నిరుపేదల కళ తీరుస్తామని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నుండి నా లక్ష్యం పేదింటికి ఒక గూడు కట్టించాలనే ఆకాంక్షతో పనిచేస్తానని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2014లో మ్యానిఫేస్టోలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ఆరేళ్లు గడిచినా ఎక్కడ కూడా డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు చకచకా పనులు కావడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లపై అవినీతికి పాల్పడ్డారని, ఏ ఒక్క లబ్దిదారుడు ఇళ్లు పొందలేదని వాటిపై ఒక సిబిఐ ఎంక్వైరీ వేయిస్తానని చెప్పినా అది అంతంతమాత్రంగానే ఉంది. కొత్త రాష్ట్రంలో నిరుపేద కుటుంబానికి మంచి డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ ఎప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చెప్పగానేచెప్పవచ్చు. ప్రభుత్వం ఏర్పడి 6 యేళ్లు పూర్తి అయినా డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల వ్యవహార శైలీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. మెదక్‌ జిల్లా పరిస్థితి చూస్తే అన్నమోరామచంద్రా అన్నట్లుగా ఉంది. జిల్లాలో 5235 డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు మంజూరు కాగా వాటిలో 1700 ఇళ్లు మాత్రమే పూర్తి అవడం గమనర్హాం . ఇంకా 3735 ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఆందోల్‌ నియోజకవర్గంకు సంబంధించి టేక్మాల్‌, రేగోడ్‌, అల్లాదుర్గం మండలాల్లో డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల ఊసేలేదు. మెదక్‌ జిల్లా కేంద్రంలో 1,336 మంది కాగా అందులో 974 ఇళ్లు మొదలయ్యాయి. నర్సాపూర్‌లో 565 ఇళ్లు మంజూరు కాగా 500 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. తూప్రాన్‌లో 743 మంజూరు కాగా 504 ఇళ్లకు పనులు జరుగుతున్నాయి. ఇంకా జిల్లాలోని మండలాల్లో డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం వివిధ దశలో ఉన్నాయి. వచ్చే నెలలో రామాయంపేట, వెల్దుర్తి మండలాల్లో డబుల్‌బెడ్‌రూమ్‌ ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్నాయని సమాచారం.
జూన్‌ నాటికి డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం
పంచాయతీరాజ్‌ ఈఈ రాంచందర్‌రెడ్డి:
మెదక్‌ జిల్లాలో డబుల్‌బెడ్‌రూమ్‌ల ఇళ్ల నిర్మాణాన్ని జూన్‌నాటికి పూర్తి చేస్తామని, వచ్చే నెలలో రామాయంపేట, వెల్దుర్తి మండలాల్లో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. కొన్ని మండలాల్లో ఆలస్యమైన మాట నిజమేనని, ఇప్పటి వరకు జిల్లాలో మూడు మండలాల్లో మాత్రమే ప్రారంభోత్సవాలు జరిగాయని, రాబోయే రోజుల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెచ్చి త్వరలోనే లబ్దిదారులకు అందేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement