Friday, April 19, 2024

ద‌ర‌ఖాస్తు చేసుకున్న 24గంటల్లోనే ధృవపత్రాలు అందించాలి : హ‌రీశ్ రావు

సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో నిరుద్యోగులు ధరఖాస్తు చేసుకొనే ఆదాయ, నివాస, కుల దృవ పత్రాలను 24 గంటల్లోనే ఇవ్వాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్డీఓలు, తహశీల్దార్ లతో మంత్రి హరీష్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఉమ్మడి జిల్లాలో ఉన్న నిరుద్యోగులు ఆదాయ, కుల, నివాస దృవ పత్రాలు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే ఆలస్యం అవడంతో పై చదువులకు, ఉద్యోగ ధరఖాస్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయ‌ని త‌న దృష్టికి వచ్చిందని, అలాంటి ఇబ్బందులు కలగకుండా దరఖాస్తు చేసుకున్న 24గంటల్లోనే చేతికి అందాలని అధికారులను ఆదేశించారు. వారి సమయం వృధా కాకుండా ఏరోజుకు ఆరోజు పత్రాలు వచ్చే విధంగా చూడాలని చెప్పారు. మీ సేవ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా మీ సేవ కేంద్రాల ఏర్పాటు అందుబాటులోకి తేవాలని సూచించారు. ఉద్యోగం కోసం అప్లై చేసే వారికి అన్నివిధాలా బాసటగా నిలవాలని చెప్పారు. ఇందుకు ఆర్డీవో లు, తహశీల్దార్ లు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు కలగకుండా చూడాలి
కేంద్రాల పర్యవేక్షణ చేయాలి..
జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, మిల్లర్స్ తో సమన్వయం చేస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి తెలిపారు. గన్ని బ్యాగ్స్ డ్యామెజ్ లేకుండా ఇవ్వాలని, తూకపు యంత్రాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తడవకుండా టార్పలిన్ కవర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్డీవోలు, తహసీల్దార్ లు అన్ని కొనుగోలు కేంద్రాలు సందర్శించి పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు. ధరణి పోర్టల్ లో కొత్తగా వచ్చిన సవరణలను కూడా రైతులకు అందుబాటులో ఉంచాలని మంత్రి హ‌రీశ్ రావు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement