Thursday, April 18, 2024

ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకు : డబుల్స్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ నవనీత్‌

  • చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఇష్టం
  • తల్లిదండ్రుల ప్రోత్సాహమే ముందుకు నడిపించింది

పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. లక్ష్యాన్ని ఛేదించాలనే తపన ఉంటే చాలు ఆత్మ్థసర్యం పెరగడంతో పాటు విజయాలు వాటంతట అవే ముందుకు వచ్చి చేరతాయి. ఆ కోవకే చెందిన బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ నవనీత్‌ బొక్క, చిన్నప్పటి నుంచి క్రీడల్లో ఆసక్తి ఉన్న అతనిని మంచి క్రీడాకారుడిని చేయాలనే తల్లిదండ్రుల తపన, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందాలన్న నవనీత్‌ ఆశలు చిగురించాయి. జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో రాణించిన నవనీత్‌ ప్రస్తుతం ఒలంపిక్స్‌లో అడుగు పెట్టడం, పథకం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకు అసుగుణంగా పుల్లెల గోపిచంద్‌ అకాడమిలో శిక్షణ పొందుతున్న నవనీత్‌ పై ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం.. – ప్రభ న్యూస్‌, రామచంద్రాపురం

జీహెచ్‌ఎంసీ భారతీనగర్‌ డివిజన్‌ పరిధిలోని భెల్‌ ఎంఐజి కాలనీలో నివాసముంటున్న నర్సింహా శ్రీనివాస్‌, అనంతలక్ష్మిలకు కుమార్తె వర్ష, కుమారుడు నవనీత్‌ బొక్క ప్రస్తుతం నవనీత్‌ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్‌ క్రీడపై మక్కువ పెంచుకున్న నవనీత్‌ జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీ-ల్లో పాల్గొని అనేక పథకాలను సాధించాడు. బీహెచ్‌ఈఎల్‌లోనిసెయింట్‌ ఆన్స్‌ పాఠశాలలో చదువుకున్న నవనీత్‌ తొమ్మిదేళ్ల ప్రాయంలో 2010 సంవత్సరంలో జరిగిన జిల్లాస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీ-ల్లో పాల్గొని మొట్టమొదటి బంగారు పతకాన్ని సాధించి శభాష్‌ అనిపించుకున్నాడు. 2014, 15, 16 సంవత్సరాల్లో వరుసగా జరిగిన రాష్ట్రస్థాయి అండర్‌ 19 బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీ-ల్లో తెలంగాణ రాష్ట్రం తరపున ప్రాతినిథ్యం వహించి పాల్గొని చాంపియన్‌ షిప్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో పాటు- 2018, 2019 సంవత్సరాల్లో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్స్‌ పోటీ-ల్లోను నవనీత్‌ పాల్గొన్నాడు. 2017లో జాతీయ స్థాయిలో జరిగిన జూనియర్స్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గొని బంగారు, కాంస్య పతకాలను గెలుచుకున్నాడు. 2018, 2020 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఖేలో ఇండియా స్కూల్‌ పోటీ-ల్లో పాల్గొని బంగారు పతకాలను సాధించాడు. 2017లో జరిగిన జాతీయ జూనియర్స్‌ పోటీ-ల్లో బంగారు పతకాన్ని సాధించడంతో 2018లో జర్మని, నెదర్లాండ్స్‌ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ జూనియర్స్‌ బ్యాడ్మింట్‌ పోటీ-లకు కేంద్ర ప్రభుత్వం నవనీత్‌ను ఎంపిక చేసి పంపించింది. అదే సంవత్సరం కెనడాలో జరిగిన ప్రపంచకప్‌ పోటీల్లోను నవనీత్‌ ప్రాతినిథ్యం వహించాడు. 2019 సంవత్సరంలో రష్యాలో ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనేందుకు నవనీత్‌ ఎంపికయ్యాడు. 2021 సంవత్సరంలో బంగ్లాదేశ్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్‌పోటీ-ల్లో పాల్గొని సిల్వర్‌ మెడల్‌ను సాధించాడు. 2022 సంవత్సరంలో నాగపూర్‌, బెంగళూరుల్లో జరిగిన పోటీ-ల్లో పాల్గొన్న నవనీత్‌, బంగారు, కాంస్య పతకాలను సాధించాడు. అదే సంవత్సరం నవంబర్‌ మాసంలో హైదరాబాద్‌లో జరిగిన ఆల్‌ ఇండియా చాంపియన్‌ షిప్‌ పోటీ-ల్లో ప్రియా అనే క్రీడాకారిణితో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌ పోటీ-ల్లో పాల్గొని చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతున్న నవనీత్‌ 2020 సంవత్సరంలో ప్రపంచ విశ్వవిద్యాలయాల చాంపియన్‌షిప్‌ పోటీ-లకు ఆంధ్ర యూనివర్శిటి నుంచి ఆడేందుకు ఎంపికైనప్పటికి కరోనా వల్ల ఆ పోటీలు 2023కు వాయిదా పడ్డాయి. తొమ్మిదో తరగతి వరకు బిహెచ్‌ఈఎల్‌లోని సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలలో చదువుకున్న నవనీత్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడిగా ఎదగడంపై ఆ పాఠశాల ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఒలంపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యం : నవనీత్‌
రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధించాను. చివరికి అంతర్జాతీయ స్థాయిలోనూ పథకాలను గెలిచాను. 2024 సంవత్సరంలో జరిగే ఒలింపిక్స్‌ క్రీడల్లో దేశం తరపున ప్రాతినిథ్యం వహించి పథకం సాదించడమే నా ఏ-కై-క లక్ష్యమని నవనీత్‌ బొక్క పేర్కొన్నాడు. అందుకోసం సుచిత్రలోని బ్యాడ్మింటన్‌ అకాడమిలో ప్రాక్టీస్‌ చేస్తున్నానని, నేషనల్‌ స్పోర్ట్స్‌, బ్యాడ్మింటన్‌ ఆఫ్‌ ఇండియా పూర్తి సహకారాన్ని అందిస్తున్నాయని తెలిపారు.

చాలా సంతోషంగా ఉంది : తల్లిదండ్రులు
మా కొడుకు జాతీయ, అంతర్జాతీయ పోటీ-ల్లో పాల్గొని పతకాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని నవనీత్‌ తల్లిదండ్రులు నర్సింహాశ్రీనివాస్‌, అనంతలక్ష్మిలు పేర్కొన్నారు. 2024లో జరిగే ఒలంపిక్‌ క్రీడల్లో నవనీత్‌ ఆడి పతకాన్ని సాధిస్తాడని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని అంతర్జాతీయ స్థాయి వరకు ఎదిగిన నవనీత్‌ ఒలంపిక్‌ పోటీ-ల్లో పాల్గొని పతకాన్ని సాధించి తన కోరికను, తన తల్లిదండ్రుల కోరికను నెరవేరుస్తాడని అందరం ఆశిద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement