Tuesday, March 26, 2024

గడ్డి‌వాము మంట‌ల్లో చిక్కుకుని ఇద్ద‌రు చిన్నారులు దుర్మ‌ర‌ణం…

మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం ఇప్పటూరులో విషాద చోటు చేసుకుంది. గడ్డివాములో మంటలు చెలరేగి ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం చిన్నారులు విజ్ఞేశ్‌, ప్రశాంత్ ఆటలాడుతూ గడ్డవాములోకి దూరారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలో బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా.. ట్రాక్టర్‌ కేజ్‌వీల్స్‌ అడ్డుగా ఉండడంతో వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చిన్నారుల కేకలు విన్న చుట్టు పక్కల వారు కేజ్‌వీల్స్‌ తొలగించి చిన్నారులను కాపాడేందుకు ప్రయత్నించారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌ దవాఖానకు తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరు చికిత్స పొందుతూ నేటి ఉద‌యం మృతి చెందారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ముగ్గురు చిన్నారులు ఆడుకుంటుండగా.. ఓ బాలుడు అగ్నిపుల్ల వెలిగించడంతోనే మంటలు వ్యాపించాయని చికిత్స పొందుతున్న సమయంలో మృతులు చెప్పినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆడుకునేందుకు వెళ్లి ఇద్దరు మృత్యువాతపడడంతో ఆయా కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది.. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement