Saturday, April 20, 2024

లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని ఆలయ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. త‌ల‌సాని

పాతబస్తీలోని ప్రముఖ దేవాలయం లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని అమ్మవారి ఆలయ అభివృద్ధికి స్థానిక ప్రజలు సహకరించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ విస్తరణ కోసం సేకరించాల్సిన స్థలాల యజమానులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే బలాలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాన్ని అద్బుతంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలయాన్ని సందర్శించిన సమయంలో ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే ఆలయాన్ని ఆనుకొని ఉన్న కొన్ని నిర్మాణాలను సేకరించడం కోసం గుర్తించినట్లు చెప్పారు.

సంబంధిత స్థలాల యజమానులకు ప్రభుత్వం తగిన న్యాయం జరిగే విధంగా పరిహారం అందిస్తుందని, ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం 9 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టే ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులకు సహకరించడం ద్వారా ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రతి సంవత్సరం బోనాల ఉత్సవాల సందర్బంగా అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని తెలిపారు. ప్రభుత్వం కూడా భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను కూడా సమర్పిస్తున్న విషయాన్ని కూడా తెలిపారు. సమావేశంలో పాల్గొన్న పలువురు స్థల యజమానులు కూడా మంత్రి పిలుపుతో సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టడం పట్ల కమిటీ సభ్యులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ సురేందర్, సభ్యులు రాజ్ కుమార్, బద్రినాద్, జగదీశ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement