Wednesday, April 24, 2024

బండి సంజ‌య్ విష‌య ప‌రిజ్ఞానం లేని తెలివిత‌క్కువ‌ ద‌ద్ద‌మ్మ – కెటిఆర్ ..

హైద‌రాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విష‌య ప‌రిజ్ఞానం లేని తెలివిత‌క్కువ‌ దద్దమ్మ అంటూ మంత్రి,బిఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు..టీఎస్‌పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని.. అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం పరిమితమనే కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్న బండి సంజయ్ మహా అజ్ఞాని అని తేలిపోయిందన్నారు. త‌న‌పై చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చిన కెటిఆర్ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలు, ప్రభుత్వ శాఖలపై కనీస పరిజ్ఞానం, వాటి మధ్య ఉన్న తేడా తెలియ‌కుండా స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా దిగజారుడు వాదనలు చేస్తున్నారని మండిపడ్డారు. బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టినట్టు ధరణి పోర్టల్, టీఎస్‌పీఎస్సీ అంశంతో ముడిపెట్టి తనపై అసత్యమైన ఆరోపణలు చేయడం సహించబోనని హెచ్చరించారు. గతంలో ఇంటర్ పరీక్షలపై కూడా ఇలాంటి అర్థరహితమైన, నిరాధారమైన ఆరోపణలు చేసిన బండి సంజయ్ ప్రజాక్షేత్రంలో అభాసుపాలై, పరువునష్టం కేసు ఎదుర్కోంటున్నారన్నారు. అయినా బండి సంజయ్‌కు బుద్ది రాలేదని, ఈసారి కూడా తనకు సంబంధం లేని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంలో అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతో బండి సంజయ్ చేస్తున్న ఈ కుట్రలకు రానున్న రోజుల్లో క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.


బీజేపీ పాలిస్తున్న అనేక రాష్ట్రాల్లో వరుసగా ఉద్యోగ నియామక ప్రక్రియలో ప్రశ్నాపత్రాలు లీకైన సందర్భాలు వందల్లో ఉన్నాయని కేటీఅర్ తెలిపారు. ఇందులో స్వయంగా బీజేపీ నేతలే ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు తేలిందనన్నారు. ప్రధానమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న గుజరాత్ రాష్ట్రంలోనే 8 సంవత్సరాలలో 13 సార్లు జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీ కుంభకోణాలపై ఏమంటావని బండి సంజయ్‌ని సూటిగా నిలదీశారు. మరి ఈ పేపర్ లీకేజీల పైన ప్రధానమంత్రి మోడీని బాధ్యున్ని చేసి ఆయన రాజీనామాను డిమాండ్ చేయాలని సవాల్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో క్వశ్చన్ పేపర్లు లీకైతే తిరిగి పరీక్షలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయని అన్నారు. మధ్యప్రదేశ్ వ్యాపం ఉద్యోగాల కుంభకోణంలోనూ బీజేపీ ఎలా వ్యవహరించిందో దేశం మొత్తానికి తెలుస‌న్నారు. బీజేపీ ప్రభుత్వాల హయాంలో జరిగితే ఒకలా.. ఇతర పార్టీలు ప్రాతినిథ్యం వహించే రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలను నిందిస్తూ మరోలా వ్యవహరించడం బీజేపీ డబుల్ స్టాండర్డ్స్ కు నిదర్శనమంటూ బిజెపికి,బండి సంజ‌య్ కి కెటిఆర్ క్లాస్ పీకారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement