Tuesday, April 16, 2024

TS: గ్లోబల్ సీఈఓలతో KTR సమావేశాలు

ఫ్రాన్స్‌లో పర్యాటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధుల బృందం రెండవ రోజు పారిస్‌లో వివిధ గ్లోబల్ సీఈఓలతో సమావేశాలు నిర్వహించింది. పలు ఫ్రెంచ్‌ వ్యాపార సంస్థల అధినేతలతో సమావేశమైంది. పారిస్‌లో మూవ్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రైజెస్ ఆఫ్ ఫ్రాన్స్ (MEDEF) డిప్యూటీ సీఈఓ జెరాల్డిన్ లెమ్లేతో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫ్రెంచ్ ఎస్‌ఎంఈలకు తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన సహకారాలను అవకాశాలను అందిస్తోందన్నారు.

MEDEF అనేది ఫ్రాన్స్‌లో అతిపెద్ద ఎంప్లాయర్ ఫెడరేషన్. ఫ్రాన్స్ లో 95% కంటే ఎక్కువ వ్యాపారాలు, SMEలు కలిగి ఉన్న ఫ్రాన్స్‌లోని ప్రముఖ వ్యాపారవేత్తల నెట్‌వర్క్ ఈ MEDEF నెట్ వర్క్. ఆహార ధాన్యాలు, మాంసం, పాలు, చేపల ఉత్పత్తిలో తెలంగాణ ఇటీవల సాధించిన విజయాలను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ” తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు అనేక అవకాశాలను తెరిచింది” అని పేర్కొన్నారు.

అనంతరం ప్యారిస్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ స్టేషన్ ఎఫ్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. స్టేషన్ ఎఫ్ బృందంతో సమావేశం కావడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో THub, WeHub, TWorks వంటి తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ సంస్థలతో  అవకాశాలు, సహకారం గురించి చర్చించారు. స్టేషన్ F అనేది ప్యారిస్ నడిబొడ్డున ఉన్న ఒక ప్రత్యేకమైన క్యాంపస్ మరియు కమ్యూనిటీ, ఇందులో 1,000 స్టార్టప్‌లు ఉన్నాయి. వాస్తవానికి రైల్వే డిపోగా ఉన్న ఈ క్యాంపస్ ఇంక్యుబేటర్‌గా మార్చడానికి పునర్నిర్మించబడింది.

మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం పారిస్‌లో ADP చైర్మన్ అండ్ సీఈఓ అగస్టిన్ డి రోమనెట్‌తోనూ సమావేశమైంది. ADP ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో పెట్టుబడి పెట్టింది. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ భారతదేశంలో విమానయాన రంగం వేగవంతమైన వృద్ధి దశలో ఉందని, కరోనా ఆంక్షలు సడలించడంతో పరిశ్రమ దేశంలో పెద్దఎత్తున విస్తరించడానికి  సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అనేక ప్రధాన ప్రపంచ ఏరోస్పేస్ కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని మంత్రి తెలిపారు. ఏరోస్పేస్ రంగానికి నాణ్యమైన సిబ్బందికి శిక్షణ ఇచ్చి సరఫరా చేయాల్సిన అవసరాన్ని కేటీఆర్ ప్రముఖంగా ప్రస్తావించారు.

మరో సమావేశంలో పరిశ్రమల మంత్రి కేటీఆర్ పారిస్‌లో సనోఫీ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ హెడ్ మిస్టర్ ఫాబ్రిస్ బస్చిరా మరియు గ్లోబల్ వ్యాక్సిన్ పబ్లిక్ అఫైర్స్ హెడ్ ఇసాబెల్లె డెస్చాంప్స్‌ను కలిశారు.  సనోఫీ త్వరలో తన హైదరాబాద్ ఫెసిలిటీ నుండి సిక్స్ ఇన్ వన్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఈ సమావేశాల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఏరోస్పేస్ & డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement