Wednesday, April 24, 2024

క‌రీంన‌గ‌ర్ లో శ్రీవారి ఆల‌యం – వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం కొనసాగుతున్న ఏర్పాట్లు…

క‌రీంన‌గ‌ర్ – వైఖానసం ఆగమ శాస్త్రం ప్రకారం… కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణ పనుల శంకుస్థాపనకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. గత సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో భూకర్షణం కార్యక్రమాన్ని నిర్వహించగా… నేడు గోనివేదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. జూబ్లీహిల్స్ టిటిడి ఆలయ అర్చకులు సత్యనారాయణ చార్యులు ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీవారి గర్భాలయం నిర్మించే ప్రతిపాదిత స్థలంలో గోమాతను… గోదూడను… తీసుకువచ్చి… భూకర్షణంలో భాగంగా వెదజల్లిన నవధాన్యాల మొలకలను తినిపించి… గర్భాలయం నిర్మించే స్థలాన్ని శుద్ధి చేశారు. కలియుగంలో తన భక్తులను అనుగ్రహించి రక్షించేందుకు… శ్రీవారు ఏడు కొండల పై వెలిశాడన్నారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ టిటిడి ఆలయ అర్చకులు సత్యనారాయణ చార్యులు. శ్రీవారి భక్తులు ప్రతి సారి తిరుమల వెళ్ళి స్వామి వారిని దర్శించుకోవడం వీలు కాదని భావించిన టిటిడి… భగవంతున్నే భక్తుల వద్దకు తీసుకు వెళ్ళే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు

ఇందు కోసం ప్రతి రాష్ట్రంలో ఒక్కో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు సంకల్పించిందన్నారు. ఇప్పటికే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో టిటిడి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నప్పటికీ… సియం కెసిఆర్… మంత్రి గంగుల కమలాకర్ చొరవతో… టిటిడి చరిత్రలో తొలిసారిగా… తెలంగాణలో హైదరాబాద్ తర్వాత 2వ ఆలయాన్ని కరీంనగర్ లో నిర్మిస్తుందన్నారు. నేడు కరీంనగర్ శ్రీవారి ఆలయం నిర్మించే స్థలంలో… వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం గోనివేదనం కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, తోట రాములు,, సుంకి శాల సంపత్ రావు,,గంప రమేష్, ఒంటెల సత్యనారాయణ రెడ్డి, వంగల పవన్, నేతి రవి వర్మ, మిడి దొడ్డి నవీన్,ఉప్పు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement