Saturday, April 20, 2024

డ్రైవర్ లకు రూ.10 లక్షల ప్రమాద బీమా : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

డ్రైవర్ లందరికీ సొంత ఖర్చులతో పది లక్షల రూపాయల ప్రమాద బీమా పాలసీలు చేయిస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రకటించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన రహదారి భద్రత అవగాహన సమావేశంలో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో డ్రైవర్లు మృత్యువాత పడడం వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. డ్రైవర్లు అందరికీ పోస్ట్ ఆఫీస్ లో సొంత ఖర్చులతో పది లక్షల రూపాయలు బీమా చేయిస్తానన్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన బాధ్యత డ్రైవర్ లపై ఉందన్నారు. రవాణా శాఖ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. అతివేగంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వము డ్రైవర్ లకు విద్యార్హత లేకున్నా లైసెన్సులు అందిస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఆటోలకు రవాణా పన్నులు రద్దు చేశారన్నారు. గ్రీన్ టాక్స్ భారీగా తగ్గించారన్నారు. రోడ్డు పై వాహనాలు నిలపడం వల్ల వెనక నుండి ఢీకొని ప్రమాదాలు జరిగి వాహనదారులు మృత్యు వాత పడుతున్నారన్నారు. బస్ డ్రైవర్లు రోడ్ మధ్యలో బస్ లు నిలపడం మానుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈశ్రం చేయించుకోవాలని, దీని వల్ల ప్రమాదాలు జరిగినపుడు భీమా లభిస్తుందన్నారు. పోస్ట్ ఆఫీస్ లో మంచి భీమా పాలసీలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి రూపేష్, ఎసిపి సారంగపాణి, సిఐలు అనిల్ కుమార్, ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఐఎంఏ అధ్యక్షులు రమాకాంత్, రవాణా శాఖ అధికారి రంగారావు, జడ్పిటిసి రామ్మూర్తి, ఎంపీపీ స్రవంతి శ్రీనివాస్, అజీజ్ తోపాటు రవాణా, కార్మిక పోస్టల్ శాఖ అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో డ్రైవర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement