Friday, April 26, 2024

వరకట్న వేధింపులకు తల్లి, బిడ్డ బలి

పెద్దపల్లి : వరకట్న వేధింపులతో తల్లి, కూతురు ఆత్మహత్మకు పాల్పడిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బుధవారం పట్టణంలోని భూమ్ నగర్‌లో నివసిస్తున్న చిగుర్ల మౌనిక (26) తన 18 నెలల కూతురు జున్నుతో కలిసి ఎల్లమ్మ చెరువు సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సీఐ ప్రదీప్‌కుమార్‌, ఎస్‌ఐ రాజేశ్‌లు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీయించారు. ధర్మారం మండలం బంజరుపల్లి గ్రామానికి చెందిన మౌనికకు సివిల్‌ సప్లయ్స్‌లో కాంట్రాక్టు పద్ధతిలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రమేశ్‌తో వివాహమైంది. వివాహం జరిగిన నాటి నుంచి వరకట్నం కోసం రమేశ్‌ మౌనికను వేధించేవాడని సమాచారం. బుధవారం ఉదయం కూడా ఇదే విషయమై గొడవ జరగడంతో మనస్తాపం చెందిన మౌనిక చిన్నారితో సహా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మౌనిక గర్భవతి కావడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement