Saturday, April 20, 2024

ఎమ్మెల్యేల కొనుగోలు అంశం పక్కదారి పట్టించేందుకే.. మోడీ పర్యటన.. బాల్క సుమన్

తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు అంశం పక్కదారి పట్టించేందుకే ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చారని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. ఆదివారం మంచిర్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… నిన్నటి మోడీ పర్యటన పూర్తిగా విఫలమైందన్నారు. ప్రధాని మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మికులు, నల్ల జెండాలతో నిరసన తెలియజేశారన్నారు. బీజేపీ ఒక బడా జూట పార్టీ, జుమ్లా పార్టీ అని అన్నారు. మోడీ పర్యటన సందర్భంగా తెలంగాణపై కేంద్రం చేస్తున్న మోసం దగా మరొకసారి నిరూపితమైందన్నారు. తెలంగాణ ప్రజలను మరొకసారి నయవంచన చేశారన్నారు. 14 నెలల క్రితమే ప్రారంభమై 68 కోట్లు లాభాలు గడించిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించడం ఒక కుట్రగా అభివర్ణించారు.


బీజేపీ ఏజెంట్లతో వేలకోట్లతో తెలంగాణ ప్రభుత్వ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చేసిన కుట్రను ఛేదించి బీజేపీని తెలంగాణ ప్రజల ముందు ద్రోహిగా నిలబెట్టినందుకే మోడీ హుటాహుటిన రామగుండం పర్యటన అని అన్నారు. రాష్ట్ర ప్రజలను, మీడియా దృష్టి మరల్చడానికే మోడీ ఆగమేఘాల మీద రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీ ప్రారంభోత్సవ డ్రామాలు చేశారన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించాలని కుట్ర చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. కేంద్రానికి ఆ ఉద్దేశం లేకపోతే ఇప్పటికే ప్రకటించిన నాలుగు బొగ్గు బ్లాక్ లను సింగరేణికి తిరిగి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. బార్డర్ లో సైనికుల్లా పనిచేసే సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో సింగరేణి 49% ప్రభుత్వ వాటాను అమ్మడానికి కేంద్రం కుట్ర చేస్తుందన్నారు. 16వ వేజ్ బోర్డుపై ఇంతవరకు ఎందుకు సమీక్షించుకోలేదని.. వెంటనే దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. రిటైర్డ్ అయిన కార్మికులకు ఇస్తున్న పెన్షన్లతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. తల్లిని చంపి బిడ్డని వేరు చేసిందని.. తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారని గతంలో బీజేపీ తెలంగాణ ప్రజలను అవమానించారన్నారు. తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే ఇక్కడి ప్రాజెక్టులకు జాతీయ హోదా, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మెడికల్ కాలేజీలు, నవోదయ విశ్వవిద్యాలయాలు, జీఎస్టీ బకాయిలను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నీతి ఆయోగ్ సిఫారసు చేసిన మిషన్ కాకతీయకు 5000 కోట్లు, మిషన్ భగీరథకు 19 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. తెలంగాణకు నిధులు ఇవ్వకుండా బ్యాంకర్లను బెదిరిస్తున్నారన్నారు.

మోడీ హయాంలో పెరిగిన గ్యాస్, ఆయిల్, నిత్యవసరాలు, పెట్రోల్ రేట్లతో దేశ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారన్నారు.
సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు, 15 లక్షల మందికి జన్ధన్ ఖాతాలో వేస్తానన్న డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కొనసాగుతున్న తెలంగాణ ప్రగతిని చూసి ఓర్వలేక కన్నెర్రతో కడుపు మంటతో తెలంగాణపై విషం కక్కుతున్నారన్నారు. మూడుసార్లు రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించకుండా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారన్నారు. ప్రకృతి సంపదను ప్రభుత్వ సంస్థలను పెట్టుబడిదారులకు అప్పనంగా కట్టబెట్టే కుట్రలకు కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. మునుగోడులో దేశ నాయకులందరూ కలిసి వచ్చిన వేలకోట్లతో ఓటర్లను ప్రభావితం చేయాలని చూసినా టీఆర్ఎస్ గెలుపుని ఆపలేకపోయారన్నారు. రాజగోపాల్ ని ఎరగవేసి కృత్రిమ ఉప ఎన్నికను సృష్టించాలని చూస్తే ప్రజలు అద్భుతమైన తీర్పుతో టీఆర్ఎస్ ని గెలిపించారాన్నారు. పూర్తిగా మోడీ పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు.. జరిగిందేమీ లేదని స్పష్టం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement