Thursday, April 25, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి..

కరీంనగర్ : యాసంగి ధాన్యం సేకరణ కోసం జిల్లాలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా తొలి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. చెర్లబూత్కూరులో ప్యాక్ అనుబంధంగా నూతన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి. 45 రోజుల్లో రాష్ట్రం మెత్తం 6400కు పైగా కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపు కోటి రూ.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామన్నారు. చెర్లబూత్కూరులో 17వేల క్వింటాళ్ల ధాన్యం గతంలో ఈ సెంటర్ ద్వారా కొనుగోలు జరిగిందని చెప్పారు. గౌరవ సీఎం కేసీఆర్ కృషితో కాళేశ్వరం జలాల ద్వారా ఎస్ఆర్ఎస్పీ 11ఆర్ కింద చెర్ల బూత్కూరుకి సమృద్ధిగా నీరుతోపాటు, నిరంతరాయ కరెంట్ వల్ల ఈ యాసంగిలో దాదాపు 20వేల క్వింటాళ్ల పైచిలుకు దిగుబడికి అంచనాతో ప్రతీ గింజ సేకరణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లాలో 351 సెంటర్లను ప్రారంభిస్తున్నామన్నారు. ఎక్కడ అవసరమున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. దాదాపు 45 రోజుల్లో పూర్తికొనుగోళ్లు జరిగేలా జిల్లాలో 4 లక్షల 34వేల క్వింటాళ్ల ధాన్యం సేకరణ అంచనాతో కరోనా నేపథ్యంలో అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. దేశం మెత్తంలో ఎక్కడ చూసినా కరోనా సాకుతో ఆర్థిక ఇబ్బందుల్ని చూపెడుతూ కొనుగోళ్లు బంద్ చేస్తుంటే సీఎం కేసీఆఱ్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కొనుగోళ్లు సజావుగా సాగేలా ఆదేశాలిచ్చారన్నారు. రైతులు సైతం ఒకేసారి లారీల లోడుతో కొనుగోలు కేంద్రాల వద్దకు రాకుండా, అధికారులు సూచించిన విధంగా టోకెన్ల వారీగా తేమ 17శాతానికి మించకుండా, తాలు, కచ్చ లేకుండా నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి ఇబ్బందులు లేకుండా లబ్దీ పొందాలని తెలియజేశారు. కొనుగోలు జరిగిన రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకే నేరుగా డబ్బులు జమచేస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వమే గ్యారంటీతో బ్యాంకుల ద్వారా దాదాపు రూ.20వేల కోట్లను సిద్దం చేసిందన్నారు.గతంలో మాదిరిగా ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వరి ధాన్యం ఏ గ్రేడు రకానికి 1888, బి గ్రేడ్ 1867 రూపాయలు చెల్లిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement