Saturday, April 20, 2024

కరోనా వ్యాక్సీనేషన్‌లో రెడ్‌క్రాస్‌ సేవలు..

పెద్దపల్లి : కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో చేపట్టిన కరోనా వ్యాక్సీనేషన్‌కు రోజు రోజుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ప్రస్తుతం రోజుకు 300 డోస్‌లు కరోనా వ్యాక్సీన్‌ ప్రజలకు అందిస్తున్నారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వ్యాక్సీనేషన్‌ కేంద్రానికి వచ్చే ప్రజలకు ఇండియన్‌ రెస్‌ క్రాస్‌ సొసైటీ తమ సేవలను అందిస్తోంది. ప్రజలు వ్యాక్సీన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, వ్యాక్సీన్‌ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడంలో రెస్‌ క్రాస్‌ సొసైటీ బాధ్యులు ముందుంటున్నారు. ప్రతి రోజు కేంద్రానికి వచ్చే వారికి సహాయ పడుతూ తమ సేవలను కొనసాగిస్తున్నారు. ఇండియన్‌ రెస్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర సభ్యులు కావేటి రాజగోపాల్‌ కేంద్రంలోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ వ్యాక్సీనేషన్‌ కోసం ఇబ్బందులు లేకుండా సహాయ సహకారాలు అందిస్తున్నారు. రెడ్‌ క్రాస్‌ సేవలతో వ్యాక్సీనేషన్‌ కేంద్రంలో ఇబ్బందులు లేకుండా త్వరితగతిన కార్యక్రమం ముందుకు సాగుతోండడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక సేవలో ముందుండే రెస్‌క్రాస్‌ సొసైటీ కరోనా వ్యాక్సీన్‌ తీసుకునేందుకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి వ్యాక్సీనేషన్‌కు సహకరించాలని సొసైటీ రాష్ట్ర సభ్యులు రాజగోపాల్‌ అవగాహన కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement