Saturday, April 20, 2024

కూల్చేటోళ్లు.. పేల్చేటోళ్లు కావాలా – సంక్షేమ సారధి కేసీఆర్ కావాలా – ప్రభుత్వ విప్ బాల్క సుమన్

చెన్నూరు – సంక్షేమ పథకాలతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంక్షేమ సారధి కేసీఆర్ కావాలో ప్రజలే తేల్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సచివాలయం కూలుస్తాం అంటున్నాడని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను పేల్చేస్తామని అంటున్నాడని.. ఇటువంటివారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా అని ప్రశ్నించారు. బండి అమీత్ షా చెప్పులు మోస్తూ బ్రోకర్ లా మారారని, రేవంత్ రెడ్డి పెద్ద బ్లాక్ మెయిల్ అని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, కేసిఆర్ కిట్, దళిత బంధు లాంటి పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలు అండగా ఉండాలన్నారు.

తెలంగాణ పథకాలను దేశమంతా విస్తరించాలని కెసిఆర్ భారత రాష్ట్ర సమితిని స్థాపించారన్నారు. బిఆర్ఎస్ ఎదుగుదలను ఓర్వలేకే ప్రధాని మోడీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులపై సిబిఐ, ఈడి, ఐటి దాడులు చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలను జైల్లో పెట్టేందుకు బిజెపి కుట్ర పన్నిందని, జైల్లు తమకు కొత్త కాదని జైల్లో ఉన్న రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కెసిఆర్ ను నిలువరించేందుకే కవితమ్మను అరెస్టు చేసేందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది అన్నారు. ప్రధాని మోడీకి దమ్ముంటే 12 లక్షల కోట్లు కొల్లగొట్టిన గౌతం అదానిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. కాలేశ్వరం జలాలతో తెలంగాణను సష్యశ్యామలం చేసిన కేసీఆర్ కు తెలంగాణ ప్రజానీకం అండగా ఉండాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement