Thursday, April 25, 2024

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఎదుట జేఏసీ నిరసనలు

ఎన్‌టీపీసీ: ఆర్‌ ఎఫ్‌సీఎల్‌ ఎదుట కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెలో భాగంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. చేపట్టిన నిరసన కార్యక్రమాలను యాజమాన్యం పోలీసులచే అడ్డుకోవడం సరికాదని నాయకులు మండిపడ్డారు. మంగళవారం తలపెట్టిన సమ్మెను విజయవంతం చేయాలని నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యాజమాన్యం మొండి వైఖరిని వీడాలని, అవినీతి, అక్రమ అధికారులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎఫ్‌సీఐ కాంట్రాక్టు కార్మికుల, మాజీ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని, ప్రభావిత గ్రామాల వారు, భూ నిర్వాసితులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న స్థానికులకు పర్మినెంట్‌ ఉద్యోగాలు ఇవ్వాలని, అవినీతి అధికారులు, కాంట్రాక్టర్లపై సీబీఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా స్థానికేతరులను తొలగించి ఇక్కడి వారికి న్యాయం చేయాలన్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు వారి పద్ధతిని మార్చుకుని అర్హులైన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని జేఏసీ తలపెట్టిన నిరసన కార్యక్రమాలను, సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల రామ్‌కిషన్‌, సల్ల రవీందర్‌, వెల్తురు మల్లయ్య, బొడ్డుపెళ్లి నారాయణ, రాజానందం, వెంకట్‌రెడ్డి, రాజ్‌కుమార్‌, నరసింహ, రత్నకుమార్‌, మహేందర్‌, ఉస్మాన్‌, రాజయ్య, భూమయ్య, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement