Tuesday, April 16, 2024

ఆగిన గుండెకు ప్రాణం పోసిన కానిస్టేబుల్

రోడ్డు ప్రమాదంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువకుడి ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటుకున్నాడు ఓ కానిస్టేబుల్. అంబులెన్స్‌ వచ్చే వరకు ఉండకుండా క్షతగాత్రుడి ప్రాణాలు కాపాడాలనే తాపత్రయంతో తనకు తెలిసిన ప్రథమ చికిత్స చేశారు. దీంతో యువకుడు  బతికాడు. ఆగిన గుండెకు ప్రాణం పోశారని స్థానికులు కరీంనగర్‌ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్‌ ఖలీల్‌ ను ప్రశంసిస్తున్నారు.

కరీంనగర్‌లోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిని బైక్ ఢీకొట్టింది. దీంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో అపస్మారక స్థితిలోకి వెళ్లి పడిపోయాడు. అయితే, అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ ఖలీల్‌.. యువకుడికి సీపీఆర్‌ నిర్వహించారు. గుండెపై తన చేతులతో ఒత్తిడి పెంచి గుండె పనిచేసేలా చేశారు. యువకుడి గుండె కొట్టుకోవడం ప్రారంభించాక వెంటనే బాధితుడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఈ విషయం తెలుసుకొని కానిస్టేబుల్‌ ఖలీల్‌ చేసిన ప్రయత్నాన్ని అభినందించారు. ఖలీల్‌ ఎంతో సమయస్ఫూర్తితో, అత్యంత వేగంగా స్పందించారని కొనియాడారు.

కానిస్టేబుల్‌ చేసిన ఈ పని తెలుసుకొని కరీంనగర్‌ సీపీ కమలాసన్‌ రెడ్డి కూడా ఖలీల్ ను అభినందించారు. లైఫ్‌ సేవింగ్‌ అవార్డుకు కానిస్టేబుల్ పేరును సిఫార్సు చేశారు. డీజీపీ మహేందర్‌రెడ్డి సైతం కానిస్టేబుల్‌ ఖలీల్‌ చేసిన మంచి పనిని అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement