Wednesday, April 24, 2024

డిగ్రీ కోర్సులపై ఇంట్రెస్టు చూపని స్టూడెంట్స్.. కాలేజీల్లో సీట్లన్నీ ఖాళీ..

ప్ర‌భ‌న్యూస్ : సాంప్రదాయ కోర్సుల వైపు విద్యార్థులు చూడడంలేదు. అంతా ఇంజనీరింగ్‌ ఇతర కోర్సులవైపే మక్కువ చూపిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా డిగ్రీ సీట్లు మిగిలాయి. దీన్ని బట్టి చూస్తే రాను రాను విద్యార్థులకు డిగ్రీపై ఆసక్తి తగ్గు తున్నట్లుగా కనిపిస్తోంది. అందులోనూ డిగ్రీలో సెమిస్టర్‌ విధానం తీసుకురావడం, ఈ కోర్సు పూర్తి చేసినా కేవలం వీటి అర్హతతో ఉద్యోగాలు పొందడం కూడా కష్టతరమవుతోంది. ఈ నేపథ్యంలో డిగ్రీ వైపు ఎవరూ చూస్తలేరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందులోనూ ఇంజనీరింగ్‌, డిగ్రీల్లోనూ సెమిస్టర్‌ విధానమే కావడంతో ఎక్కువ మంది ఇంజనీరింగ్‌ వైపు చూస్తున్నారు. అలాగే లా కోర్సు, వైద్య విద్యకు డిమాండ్‌ పెరగడంతో ఎక్కువ మంది విద్యార్థులు అటువైపు మక్కువ చూపుతున్నారు.

తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు దోస్త్‌ ద్వారా నిర్వహిస్తారు. రాష్ట్రంలో మొత్తం 1080 ప్రభుత్వ, ప్రైవేట్‌, రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలున్నాయి. ఇందులో మొత్తం 4,66,345 డిగ్రీ సీట్లున్నాయి. అయితే పలు విడతల వారీగా జరిపిన కౌన్సెలింగ్‌ ద్వారా 2,49,266 సీట్లు మాత్రమే భర్తీకాగా, ఇంకా 2,17,079 సీట్లు ఖాళీగా మిగిలాయి. మొత్తం 1080 కాలేజీల్లో దోస్త్‌ పరిధిలో లేని కోర్టు కేసు ఉన్న కాలేజీలు, మైనారిటీ కాలేజీలు 65 ఉన్నాయి. వీటన్నిటిలో కలిపి 2,49,266 సీట్లు మాత్రమే నిండాయి. సీట్లు భర్తీ కావడానికి రిజిస్ట్రేషన్ల గడువు పెంచుతూ దాదాపు 5 విడతల్లో అధికారులు కౌన్సెలింగ్‌ నిర్వహించినా డిగ్రీ సీట్లు అనుకున్న స్థాయిలో నిండలేదు. కరోనా నేపథ్యంలో ఇంటర్‌లో అందరినీ పాస్‌ చేసిన నేపథ్యం లో డిగ్రీలో చేరే వారి సంఖ్య పెరుగుతుందని భావిం చిన అధికారుల అంచనాలు తారుమారయ్యాయి. విద్యార్థుల నుంచి స్పందన కరువైంది. అయితే మొత్తం గా చూసుకుంటే గత ఏడాదితో పోలిస్తే అడ్మిష్ల సంఖ్య స్వల్పంగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement