హైదరాబాద్: ఆత్మగౌరవంతో బతకాలనేది పేదల కల అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ ను ఇవాళ సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… “రోటీ, కపడా, ఔర్ మకాన్ అనేది ఇందిరమ్మ నినాదమన్నారు. ఇల్లు, వ్యసాయ భూమిని ప్రజలు ఆత్మగౌరవంగా భావిస్తామని పేర్కొన్నారు. అందుకే ఇందిరాగాంధీ దశాబ్దాల క్రితమే ఇళ్లు, భూపంపిణీ పథకాలను ప్రారంభించారని గుర్తు చేశారు. దేశంలో గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ.. ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదన్నారు.
రూ.10వేలతో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇవాళ రూ.5లక్షలకు చేరుకుందన్నారు రేవంత్. ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన వారికే ప్రభుత్వ ఇల్లు చెందాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. గతంలో కేసీఆర్ రద్దు చేసిన గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించామని అంటూ.. తొలి దశలో 4.50లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చాం” అని రేవంత్ అన్నారు.
కాగా, ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్ యాప్ ద్వారా శుక్రవారం నుంచి లబ్ధిదారుల పేర్లను నమోదు చేయనున్నారు. ప్రతి మండల కేంద్రంలో మోడల్ హౌస్ ఏర్పాటు చేయనున్నారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నారు. నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్ జెండర్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. గ్రామసభల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల ఎంపిక చేయనున్నారు.
మమ్మల్ని ఇరుకున పెట్టండి..
ప్రభుత్వానికి విపక్షాలు సూచనలు ఇచ్చే సంప్రదాయం గతంలో ఉండేదని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. ఆ సంప్రదాయాన్ని ఇప్పుడు దెబ్బతీస్తున్నారన్నారు. పాలక, ప్రతిపక్షాలు శత్రుపక్షాలు అన్నట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. పాలక, ప్రతిపక్షాలు కలిస్తేనే ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో ఇరుపక్షాలకు సమాన ప్రాధాన్యం ఉంటుందన్నారు. పెద్దమనిషిగా కేసీఆర్ సూచనలు చేయాలని హితువుపలికారు. ‘‘మాకేమీ భేషజాలు లేవు.. పాలక పక్షాన్ని ప్రశ్నించండి. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి. అవసరమైన సూచనలు చేయాలి’’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.