Thursday, March 28, 2024

ఖ‌మ్మంలో ష‌ర్మిల సంక‌ల్ప‌ స‌భ – రూట్ మ్యాప్ విడుద‌ల

హైదరాబాద్‌: తెలంగాణ‌లో కొత్త పార్టీ ఏర్పాటు దిశ‌గా తొలి అడుగుగా వైఎస్ ష‌ర్మిల ఖ‌మ్మంలో ఈ నెల తొమ్మిదో తేదిన భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించనున్నారు… ఖ‌మ్మం పెరేడ్ గ్రౌండ్ లో స‌భ‌కు సంబంధించిన ఏర్పాట్లు యుద్ద‌ప్రాతి ప‌దిక‌న కొన‌సాగుతున్నాయి.. కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ప‌రిమిత సంఖ్య‌లో ప్ర‌జ‌ల‌ను అనుమ‌తిస్తూ ఈ సభ‌కు ఖ‌మ్మం పోలీసులు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.. ఈ నేప‌థ్యంలో ఖ‌మ్మం ష‌ర్మిల ప‌ర్య‌ట‌న రూట్ మ్యాప్ ను అభిమానులు విడుద‌ల చేశారు..ఈ స‌భ‌లో ముఖ్య అతిథిగా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి స‌తీమ‌ణి విజ‌య‌మ్మ పాల్గొన‌నున్నారు.. హైదరాబాద్ నుంచి సుమారు 190 కిలోమీటర్ల దూరం ఉన్న ఖమ్మం నగరానికి ఆమె ఏఏ మార్గాల మీదుగా బయలుదేరి వెళ్తారనే విషయాన్ని షర్మిల పార్టీ నాయకులు వెల్లడించారు. తొమ్మిదో తేదిన లోట‌స్ పాండ్ నుంచి హయత్ నగర్, చౌటుప్పల్, నకిరేకల్, సూర్యాపేట్, నాయకన్‌గూడెం మీదుగా వైఎస్ షర్మిల సంకల్ప యాత్ర సాగుతుంది. షెడ్యూల్ ప్రకారం.. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఆమె బంజారాహిల్స్‌లోని లోటస్ పాండ్ నుంచి బయలుదేరుతారు. లక్డీకాపూల్, కోఠి, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీ నగర్ మీదుగా హయత్ నగర్ చేరుకుంటారు. హయత్ నగర్‌లో రోడ్ షో నిర్వహించే అవకాశం ఉంది. చౌటుప్పల్, నకిరేకల్, సూర్యాపేట్ మీదుగా 1:15 నిమిషాలకు ఆమె చివ్వెంలకు చేరుకుంటారు. ఆయా ప్రాంతాలన్నింటి చోట రిసీవింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కన వేదికల మీద నిల్చుని వైఎస్సార్ అభిమానులు ఆమెకు స్వాగతం పలుక‌నున్నారు. చివ్వెంలలో మధ్యాహ్న భోజనం అక్కడే పూర్తిచేస్తారు. అనంతరం మోతె మండలం నామవరం, నాయకన్ గూడెం మీదుగా ఖమ్మం చేరుకుంటారు. సాయంత్రం 5:15 నిమిషాలకు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించ‌నున్నారు.. ఇదే స‌భ‌లో పార్టీ పేరు, గుర్తు, విధివిధానాల‌ను ష‌ర్మిల‌ ప్ర‌క‌టించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement