Friday, April 19, 2024

టిమ్స్ డైట్ కాంట్రాక్ట‌ర్ తొల‌గింపు..

హైదరాబాద్‌, :కరోనా సోకడంతో గచ్చిబౌలిలోని పేషెంట్లకు వేళకు భోజనం సమకూర్చడం లేదన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం, వైద్య, ఆరోగ్యశాఖ స్పందించింది. మే 1 నుంచి టిమ్స్‌ డైట్‌ కాంట్రాక్టర్‌ను మార్చాలని ఆసుపత్రి సూపరిండెంట్‌ను ఆదేశించింది. కరోనా పేషెంట్లకు ఆహారం అందించడంలో కొంత ఆలస్యమైన మాట వాస్తమేనని టిమ్స్‌ డైరెక్టర్‌ అంగీకరించారు. కరోనా పేషెంట్ల అభిప్రాయాల మేరకు కాంట్రాక్టర్‌ను మారుస్తున్నట్లు తెలిపారు. అయితే… టిమ్స్‌ లో భోజనం సకాలంలో అందించకపోవడంతో రోగులు మృత్యువాత పడుతున్నారని గురువారం ఓ పేషెంట్‌ సోషల్‌ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు.
టిమ్స్‌లో సిబ్బంది కొరత…
మరోవైపు టిమ్స్‌ లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని వైద్యులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐసీయూ వార్డులోనే 40మంది పేషెంట్లకు 1 నర్సు, 1 సీనియర్‌ రెసిడెంట్‌ మాత్రమే ఉన్నారనితెలంగాణ డాక్టర్స్‌ ఫెడరేషన్‌ కన్వీనర్‌ డా. పీ. ఎస్‌. విజయేందర్‌ ఆరోపిస్తున్నారు. ఐసీయూలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక ఆసుపత్రి మొత్తం మీద మరింత దయనీయంగా ఉందని తెలుస్తోంది. కనీసం పేషెంట్‌ చనిపోతే డెడ్‌బాడీని తరలించేందుకు వార్డు బాయిలు కూడా లేరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమపై ఒత్తిడి పెరుగుతోందని ఎవరైనా అడిగితే ఉన్నతాధికారులు వేధిస్తున్నారని వైద్యులు వాపోతున్నారు. కరోనా సోకిన వైద్యులను కూడా విధులకు రప్పిస్తున్నారని, కనీసం రవాణా సదుపాయం కూడా ఏర్పాటు చేయడంలేదని ఆసుపత్రి ఉన్నతాధికారుల తీరుపై వైద్యులు మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement