Tuesday, March 26, 2024

పోలీస్ శాఖ‌లో ప‌దోన్న‌తుల జాత‌ర‌..

హైదరాబాద్‌, : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వయో పరిమితి పెంపు తదితర నిర్ణయాలు పోలీసు శాఖకు వరంగా మారాయి. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న పలువురు అధికారులకు పదోన్న తులు వెంటవెంటనే లభించాయిు. సీఎం ప్రకటనకు తోడుగా పోలీసు శాఖ అంతర్గతంగా తీసుకున్న నిర్ణయంలో కొన్ని విచిత్రాలు చోటు చేసుకున్నాయి. పదోన్నతుల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నాన్‌ కేడర్‌ ఎస్పీలకు ఐపీఎస్‌ హోదా 26 మందికి దక్కనుంది. అదనపు ఎస్పీలకు నాన్‌ కేడర్‌ ఎస్పీలుగా, డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా, సీఐలకు డీఎస్పీ లుగా పదోన్నతులు లభించాయి. దీంతో కానిస్టేబుల్‌ కేడర్‌ నుంచి ఎస్పీ స్థాయి అధికారి వరకు లబ్ధి చేకూరింది. ఒక వైపు 30 శాతం ఫిట్‌మెంట్‌ పెంపు, మరో వైపు మూడేళ్ళ వయో పరిమితి పెంపుతో పోలీసు శాఖ సంబరాలను చేసుకుంటుంది.
ఈ క్రమంలో ఐపీఎస్‌ హోదా లభించే 26 మంది నాన్‌ కేడర్‌ ఎస్పీలు విచిత్ర పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. కేంద్ర సర్వీసుల నిబంధనల ప్రకారం రిటైర్‌ మెంట్‌ వయసు 60 ఏళ్లు. కాగా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరికి ఐపీఎస్‌ హోదా దక్కనుంది. ఆ లెక్కన ఈ 26 మంది ఒక ఏడాది ముందే రిటైర్‌ కావాల్సి ఉంటుంది. ఒకవేళ వీరికి ఐపీఎస్‌ కన్ఫర్మ్‌ కాకపోయి ఉంటే మరో ఏడాది నాన్‌కేడర్‌ ఎస్పీలుగా కొనసాగే అవకాశాలు ఎలాగూ ఉండేది.
ఏడాది సర్వీసు, హోదా దక్కడం ద్వారా వీరంతా ఏడాది సర్వీసును వదులు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాఖలోని పలువురు ఉద్యోగులకు రిటైర్మెంట్‌కు సరిగ్గా వారం రోజుల ముందు ప్రభుత్వం వారికి వరుసపెట్టి శుభవార్తలు చెప్పిం ది. ఫిట్‌మెంట్‌ పెంపు, సర్వీసు పొడిగింపు ఇలా.. మొత్తానికి ఇవన్నీ పదవి నుంచి తప్పుకునే క్రమంలో తనకు దక్కిన అపూర్వ అవకాశంగా భావిస్తున్నారు. డిపార్ట్‌మెంట్‌లో ఏటా రెండువేల మంది వరకు రిటైర్‌ అవుతుంటారు. ఈ లెక్కన చూస్తే వీరందరికీ లాభం చేకూరినట్లేనని పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. మరో మూడేళ్ల వరకు అంటే 2024 మార్చి వరకు డిపార్ట్‌మెంట్‌లో దాదాపుగా రిటైర్మెంట్లు అన్న మాటే వినిపించదు. ప్రభుత్వ ప్రకటనతో డిపార్ట్‌మెంట్‌లో ఉన్న దాదాపు 80 వేల మంది సిబ్బంది సంతోషంగా ఉన్నారు.
మూడు వారాల్లో మూడేళ్ల సర్వీస్‌ మిస్‌..!
పోలీస్‌ శాఖలో మార్చి నెలాఖరు నాటికి గ్రేటర్‌లోని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండలో దాదాపు 50 మంది, మిగిలిన జిల్లాల్లో దాదాపు 60 మంది వరకు అంటే మొత్తం 110 మంది రిటైర్‌ కావాల్సి ఉంది. కానీ వీరందరికీ ఏకంగా మూడేళ్ల సర్వీసు, 30 శాతం ఫిట్‌మెంట్‌తో కలిసి వచ్చింది. అదే సమయంలో ఫిబ్రవరి 28న డిపార్ట్‌మెంట్‌లో దాదాపు వంద మందికిపైగా పోలీసులు పదవీ విరమణ చేశారు. వయో పరిమితి పెంపు ప్రకటన వచ్చాక వీరంతా తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. కేవలం మూడు వారాల వ్యవధిలో మూడేళ్ల సర్వీసు కోల్పోయామని నిర్వేదంలో పడ్డారు.
అనుభవం పనికి వస్తుంది
శాఖకు మరింత మంచి పేరు రావాలంటే అనుభవజ్ఞుల సేవలు ఎంతగానో అవసరమని అధికారులు అంటున్నారు. ఏళ్ళ తరబడి క్షేత్ర స్థాయిలో పని చేయడం, మంచి ఎవరు, చెడు ఎవరు అని గుర్తించేంత అనుభవం కలిగి ఉండటం, ప్రజలతో పరిచయాలు ఉండటంతో సమాచారాన్ని సేకరిం చడం సులభం అవుతుందంటున్నారు.
నేర పరిశోధన, కేసుల విచారణ, కోర్టులకు కావాల్సిన ఆధారాలను సేకరించడం, ప్రాసిక్యూషన్‌కు కావాల్సిన సమాచారాన్ని అందిచడం ద్వారా నేరస్థులు తప్పించుకునేందుకు వీలుండదని చెబుతున్నారు. పోలీసుస్టేషన్‌లో పని చేసే స్టేషన్‌ రైటర్‌ అనుభవజ్ఞుడైతే దర్యాప్తు అధికారులకు కొంత వెసులుబాటు కలుగుతుందని, చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని కేసు షీట్‌ను తయారు చేస్తారన్నారు. అదే కొత్త వ్యక్తికి పనిని అప్పగిస్తే అతడికి అనుభవం వచ్చేంత వరకు దర్యాప్తు అధికారులు వెంట ఉండాల్సి వస్తుందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement