Friday, April 26, 2024

కేబీఆర్ పార్క్ లో పిచ్చుకల దినోత్సవం

పిచ్చుకలు మానవ జీవన విధానంలో భాగంగా కొనసాగాయని, అవి అంతరించిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ ఉద్యానవనం (కేబీఆర్ పార్క్)లో జరిగిన ప్రపంచ పిచ్చుకల దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పక్షుల ప్రాధాన్యతను అందరికీ గుర్తు చేసేలా తాను గిఫ్ట్ ఏ నెస్ట్ కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నట్లు వెల్లడించారు. వివిధ వేడుకలు, దినోత్సవాల్లో బహుమతిగా మొక్కలు, సహజ సిద్దంగా తయారు చేసిన పిట్ట గూళ్లు ఇచ్చే సంస్కృతి రావాలని ఆకాంక్షించారు.ప్రభుత్వం, అటవీ శాఖ చర్యల వల్ల తెలంగాణలో అడవులు, పర్యావరణం బాగా మెరుగుపడిందని తెలిపారు. జంతువులు, పక్షి జాతుల సంచారం కూడా గతంతో పోల్చితే స్పష్టంగా పెరిగిందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ అన్నారు. చిన్నతనంలో పిచ్చుకలతో ఆడుకున్న రోజులు అందరికీ గుర్తేనని, ఆ మధురస్మృతులు వచ్చే తరానికి అందించడమే అందరి కర్తవ్యం కావాలన్నారు. పిచ్చుకల దినోత్సవంలో భాగంగా కేబీఆర్ పార్కులో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయమే బర్డ్ వాచింగ్ తో పాటు, పర్యావరణ అవగాహన, అటవీ ప్రాంతాల్లో చేయదగిన, చేయకూడని పనులు,పిట్టుగూళ్ల పంపిణీ, పిల్లలకు డ్రాయింగ్, స్లోగన్స్ తయారీ, సిగ్నేచర్ కాంపెయిన్లను నిర్వహించారు.

 

Advertisement

తాజా వార్తలు

Advertisement