Sunday, March 24, 2024

నేడు హైటెక్ సిటీ ఆర్‌యూబీ ప్రారంభించనున్న కేటీఆర్

హైదరాబాద్‌, రాజధాని హైదరాబాద్‌లో టెకీల ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పడనుంది. హైటెక్‌సిటీ- కూకట్‌పల్లి మార్గంలో రోజూ గంటల తరబడి ట్రాఫిక్‌ పద్మ వ్యూహంలో చిక్కుకుని ఆఫీసులకు వెళ్లే ఐటీ ఉద్యోగులకు భారీ ఉపశమనం కలగనుంది. రహదారులను సిగ్నల్‌ రహితంగా చేసేందుకు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా చేపట్టిన మరో ప్రాజెక్టు నగర వాసులకు అందుబాటులోకి రానుంది. రూ.66.59 కోట్ల వ్యయంతో నిర్మించిన హైటెక్‌ సిటీ రైల్వే అండర్‌ బ్రిడ్జి(ఆర్‌యూబీ)ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభిం చనున్నారు. దాదాపు 410 మీటర్ల పొడవు, 20.50 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఆర్‌యూబీ అందుబాటులోకి వస్తే కూకట్‌పల్లి- హైటెక్‌ సిటీ మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పనున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులకు ఉపశమనం కలగనుంది. ఈ మార్గంలో లాక్‌డౌన్‌కు ముందు నిత్యం 5 నుంచి 6 లక్షల వాహనా లు రాకపోకలు సాగించేవని ట్రాఫిక్‌ పోలీసుల అంచనా. ఇప్పటికే స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌(ఎస్‌ఆర్డీపీ)లో భాగంగా మొదటి దశలో గచ్చిబౌలి నుంచి జేఎన్‌టీయూ వరకు చేపట్టిన పలు పైవంతెనలు, అండర్‌పాస్‌లు, బయో డైవర్సిటీ, మైండ్‌ స్పేస్‌, అయ్యప్ప సొసైటీ, రాజీవ్‌గాంధీ జంక్షన్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. హైటెక్‌ సిటీ ఆర్‌యూబీ నిర్మాణానికి ముందు శేరిలింగంపల్లి నుంచి వచ్చే వరద నీరు ఈ బ్రిడ్జి కింద నుంచే వెళ్లేది. ఈ నీటితో అండర్‌ బ్రిడ్జి ఎప్పుడూ నీటితో నిండి ఉండేది. ఇక భారీ వర్షాలు పడితే అక్కడి పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ నీటని నిల్వ చేసేందుకు బ్రిడ్జి కింద పెద్ద సంపు నిర్మించారు. ఈ సంపులో నిల్వ చేసిన నీటిని మూసాపేట్‌ సర్కిల్‌లో నాటిన హరిత హారం మొక్కలకు వాడుతున్నారు. ఇప్పటికే దాదాపు రూ.1010 కోట్లకుపైగా వ్యయంతో చేపట్టిన ఈ తరహా 18 ప్రాజెక్టులు నగర పౌరులకు అందుబాటులోకి వచ్చాయి. రూ.4741.97 కోట్ల వ్యయంతో చేపడుతున్న మరో 20 పనులు నిర్మాణ దశలో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement