Friday, April 26, 2024

ప్రతి విజయం ఇతరులకు ఆదర్శంగా నిలవాలి : ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

క్రీడాకారులుగా మీరు సాధించిన ప్రతి విజయం ఇతరులకు ఆదర్శంగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. హైదరాబాద్ లోని ఉప్పల్, రామంత పూర్ పాలిటెక్నిక్ జూనియర్ కళాశాల మైదానంలో టీఆర్ఎస్వీ ఉప్పల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉప్ప‌ల్ నియోజకవర్గ క్రికెట్ టోర్నమెంట్ సీజన్-2022 కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డితో కలిసి పాల్గొని, విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈనెల 28 నుండి 30 వరకు నిర్వహించిన క్రికెట్ టోర్న‌మెంట్ 2022 పోటీల్లో మొత్తం 16 టీములు పాల్గొన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో రన్నర్స్ టీమ్ గా ఆనంద్ టీమ్, విన్నర్ టీమ్ గా కలిల్, గౌస్ టీమ్ నిలిచారు. ఆ తర్వాత క్రికెట్ టోర్నమెంట్ విజేతకు ఈ సందర్భంగా ఉప్పల ఫౌండేషన్ నుంచి రూ.20ల‌ చెక్కును ప్రైజ్ మనీగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈసంద‌ర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా కు షీల్డ్ బహుకరించి, శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్న సందర్భంగా.. పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ క్రీడలు క్రీడాకారులకు ఆనందం, ఆరోగ్యంతో పాటు అందరికి స్పూర్తి దాయకంగా ఉంటుందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాలుగా నియోజకవర్గ స్థాయి, క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ అంకితభావంతో పనిచేస్తూ క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. అదేవిధంగా క్రీడాకారులను ప్రోత్సాహించి సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాల్సిన భాధ్యతలు ప్రతి ఒక్కరూ తీసుకొవాలని సూచించారు. ఆరోగ్యవంతంగా జీవించాలంటే ప్రతి ఒక్కరూ క్రీడలు బాగా ఆడాలని అనవసరమైన విషయాలు వదిలేసి మంచి అలవాట్లు, సమయపాలన పాటిస్తూ, ఆహారంపై శ్రద్ధ వహించాలని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో.. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుంద‌న్నారు. అన్ని రకాల క్రీడలకు అనుకూలంగా.. పని చేస్తూ క్రీడలకు, క్రీడా రంగానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో, మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో జిల్లాకు ఒక స్టేడియం కట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. క్రీడాకారులు మంచిగా ఆడి క్రీడల్లో రాణించి, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో విజయం సాధించి, దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ కు, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు. త‌నకు కూడా క్రీడలు అంటే చాలా ఇష్టమని, క్రీడలకు, క్రీడాకారులకు త‌న వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో.. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్ మోహన్, మాజీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబెర్ గుళ్ళూరి అంజయ్య, చిలకా నగర్ కార్పొరేటర్ బన్నాల ప్రవీణ్, మేకల హన్మంత్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, పాలిటెక్నిక్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వినయ్ కుమార్, టీఆర్ఎస్వీ జనరల్ సెక్రటరీ బి.ప్రశాంత్ గౌడ్, నిర్వాహకులు దినేష్, బాబు, రాజశేఖర్, శశిధర్, రంజిత్, మోహన్, మహేష్ టి.మహేష్, వెంకటేష్, టీఆర్ఎస్వీ నాయకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement