Friday, April 19, 2024

మినీ పుర‌పాల‌క పోరుకు ఎన్నిక‌ల సంఘం సిద్ధం….

హైదరాబాద్‌, రాష్ట్రంలో మునిసిపల్‌ ఎన్నిక ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్ధసారథి తెలిపారు. త్వరలో నోటిఫికేషన్‌ దిశగా కార్యాచరణ చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌, ఖమ్మం నగరపాలక సంస్థ, సిద్దిపేట, నకిరేకల్‌, అచ్చంపేట్‌, జడ్చర్ల, కొత్తూర్‌ మునిసిపాలిటీలకు సాధారణ ఎన్నికలు, గ్రేటర్‌ #హదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్ , మరికొన్ని మునిసిపాలిటీలలో ఏర్పడ్డ ఖాళీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపుకు నోటిఫికేషన్‌ జారీచేశామని, ఎన్నికల నిర్వహణ పూర్తి అయ్యే వరకు ప్రతి అంశంలో అవసరమైన ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ మేరకు సంబంధిత జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థల), మునిసిపల్‌ కమీషనర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ మొదలైందని, ఈ ఎన్నికలకు మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌, డైరెక్టర్‌లు రాష్ట్ర ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తారన్నారు. సాదారణ ఎన్నికల సందర్భంగా వివిధ అంశాలకు సంబంధించి, సూచనలు, నియమా వళి రూపొందించి ప్రచురించామని, అవే సూచనలు, నియమ నిబంధనలు ప్రస్తుతం ఎన్నికలకు వర్తిస్తాయని, ఈ సూచనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించేలా అధికారులు పర్యవేక్షిస్తార న్నారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, సామాగ్రి, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, భద్రత, బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణ, ఇండేలిబుల్‌ ఇంకు తదితర అంశాలకు సంబంధించి సంబంధిత అధికారులతో సంప్రదించి సీడీఎంఏ పర్యవేక్షిస్తారన్నారు.
జనవరి 1వ తేదీ వరకు అర్హతగల ఓటర్ల జాబితాను భారత ఎన్నికల సంఘం జనవరి 1న ప్రచురించామని, ఆ జాబితాను టీ పోల్‌ సర్వర్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందన్నారు. ఈ జాబితాను ఆధారంగా ఏప్రిల్‌ 5వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించామని, దానిపై అభ్యంతరాలె పరిశీలించి ఏప్రిల్‌ 11వ తేదీన తుది ఓటరు జాబితా వార్డు వారీగా ప్రచురించాలన్నారు.
పోలింగ్‌ స్టేషన్ల గుర్తింపుకు నోటిఫికేషన్‌ జారీ చేశామని, వీలైనంతవరకు గతంలో ఉపయోగించిన పోలింగ్‌ స్టేషన్లనే వాడుకునేలా చూడాలని, ఏప్రిల్‌ 14వ తేదీన పోలింగ్‌ స్టేషన్ల తుది జాబితా ప్రచురించాలన్నారు. రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారుల జాబితా ఏప్రిల్‌ 7వ తేదీ లోపు రాష్ట్ర ఎన్నికల అధికారి (సీడీఎంఏ)కి సమర్పించాలని, ఆ జాబితాలను రాష్ట్ర ఎన్నికల అధికారి 8వ తేదీ లోపు ఆమోదించి జిల్లా కలెక్టర్లకు పంపాలన్నారు. రిటర్నింగ్‌ అధికారులకు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు ఏప్రిల్‌ 12వ తేదీ లోపు శిక్షణ పూర్తి చేయాలని ఆదేశించారు. బ్యాలట్‌ బాక్సులను అవసరం మేరకు పరిశీలించి సిద్ధంగా ఉంచుకోవాలని, అవసరం మేరకు మరమ్మత్తులు జరిపి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు.
వార్డు వారీ బ్యాలెట్‌ పేపర్‌ ముందుగా అంచనా వేసుకొని బ్యాలట్‌ పేపర్‌ ముద్రణకు ప్రింటింగ్‌ ప్రెస్‌లను గుర్తించి, పోటీ చేయు అభ్యర్థుల జాబితా సిద్ధమైన వెంటనే తగు బందోబస్తు ఏర్పాట్లు చేసుకొని ముద్రించుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ సజావుగా, స్వేచ్చాయుత వాతావరణంతో ప్రశాంతంగా నిర్వహించేం దుకు సంబంధిత పోలీస్‌ ఆధికారులతో చర్చించి బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఆదర్ష ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని, సాధారణ ఎన్నికలు నిర్వ#హంచే స్థానిక సంస్థలలో ఆయా మునిసిపల్‌ కార్పొరేషన్‌, నగర పాలక సంస్థ, మునిసిపాలిటీ పరిధిలో ప్రవర్తనా నియమావళి నోటిఫికేషన్‌ తేదీ నుండి వర్తిస్తుందని, ఎన్నికలు నిర్వహించే మునిసిపాలిటీలలో ఆ మొత్తం మునిసిపాలిటీ పరిధిలో ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందన్నారు.
సాధారణ ఎన్నికలు జరిగే మునిసిపల్‌ కార్పొరేషన్‌ మరియు మునిసిపాలిటీలకు సాధారణ పరిశీలకులను, వ్యయ పరిశీలకులను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమిస్తుందని, ఎన్నికలు జరిగే మునిసిపాలిటీలలో సాధారణ, వ్యయ పరిశీలన కొరకు సంబంధిత కలెక్టర్లు తగిన అధికారులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో చేయాల్సిన వివిధ పనులు, వాటిని పూర్తి చేయవలసిన తేదీలను సూచిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టిక తయారు చేసి మునిసిపల్‌ కమీషనర్‌లకు పంపామని ఆయన తెలిపారు. సంబంధిత జిల్లా కల్లెక్టర్లు నిర్ణీత తేదీలలో ఆయా పనులు తుచా తప్పకుండా జరిగేలా చూడాలని కోరారు.
కోవిడ్‌-19కు సంబంధించి ప్రత్యేకంగా సూచనలు జారీ చేశామని, వాటిని తప్పనిసరిగా పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించేలా, భౌతికదూరం పాటించేలా చూడాలన్నారు. శానిటైజర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశానికి కమీషనర్‌ మరియు డైరెక్టర్‌, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ సత్యనారాయణ, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌ కుమార్‌, సంబధిత జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement