Friday, April 26, 2024

ఈటెల మెడ‌కు భూక‌బ్జా ఉచ్చు…..

హైదరాబాద్‌, : రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ భూ వివాదంలో చిక్కుకున్నారు. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలో జమున హ్యాచరీస్‌ కోసం పేదలను, అధికారులను బెదిరింపులకు గురిచేసి భూ ఆక్రమణలకు పాల్పడ్డారని బాధిత రైతులు నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. తమ అసైన్డ్‌ భూములను మంత్రి ఈటల రాజేందర్‌, ఆయన అనుయాయులు సుదర్శన్‌, యంజాల సుధాకర్‌రెడ్డిలు ఆక్రమించుకుంటున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. రైతులు చాకలి లింగయ్య, చాకలి బిచ్చవ్వ, చాకలి కృష్ణ, చాకలి నాగులు, చాకలి పరశురాం, ఎరుకల ఎల్లయ్య, ఎరుకల రాములు సీఎంకు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. అచ్చంపేట, హకీంపేట్‌ గ్రామాల్లో 130/5, 130/10, 64/6 సర్వే నంబర్లలో గల భూమిని మంత్రి కబ్జా చేశాడని ఆరోపిం చారు. శుక్రవారం మంత్రిపై వచ్చిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపగా, తనకు అందిన ఫిర్యాదు నేపథ్యంలో తక్షణమే జిల్లా కలెక్టర్‌ ద్వారా విచా రణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ సీఎస్‌ను ఆదేశించారు. మంత్రిపై ఆరోపణలు వచ్చిన సందర్భంలో సీఎం కేసీఆర్‌ మంత్రిని వివరణ కోరకుండా.. నేరుగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ను ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. అయితే అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన మం త్రి ఈటల రాజేందర్‌ విచారణను స్వాగతిం చారు. తనపై సిట్టింగ్‌ జడ్జితో కూడా విచారణ జరపా లని, తా ను ఒక్క ఎకరం అసైన్డ్‌ భూమి కూడా ఆక్రమిం చలే దని, తప్పుచేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు.
సీఎం సీరియస్‌.. సమగ్ర దర్యాప్తు
మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చం పేట శివారులోని భూములు కబ్జాకు గురయ్యా యనే విషయంలో తనకు అందిన ఫిర్యాదును పురస్క రించుకుని వెంటనే దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌ ద్వారా తెప్పించి రిపోర్టు అందజే యాల్సిందిగా సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ను ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ భూ ముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజాని జాలను నిగ్గు తేల్చాల్సిందిగా విజిలెన్స్‌ డీజీ పూర్ణ చందర్‌రావుని సీఎం ఆదేశించారు. సత్వరమే ఇందు కు సంబంధించి ప్రాథమిక నివేదికను అందజేసి అనం తరం సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలను అందజె యాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ ఆరోపణలు
మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీం పేట్‌ గ్రామాలకు చెందిన 8మంది రైతులు చాకలి లింగయ్య, చాకలి బిచ్చవ్వ, చాకలి కృష్ణ, చాకలి నాగు లు, చాకలి పరశురాం, ఎరుకల ఎల్లయ్య, ఎరుకల రాములు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. తమ భూములు కబ్జాచేశారని, ఆక్రమించి రోడ్లు వేశారని.. తమ భూములు తమకు ఇప్పించి న్యాయం చేయాలని లేఖలో పేర్కొన్నారు. కబ్జా చేసిన భూ ముల్లో హ్యాచరీస్‌ కోసం షెడ్ల నిర్మాణం చేపట్టినట్లు బాధిత రైతులు తెలిపారు. ప్రశ్నిస్తే తమ భూములకు దారి లేకుండా చేస్తామంటూ బెదిరింపులకు గురి చేసినట్లు చెప్పారు. భూమి పత్రాలను సైతం దౌర్జ న్యంగా లాక్కున్నారని ఆరోపించారు. ఈటలతో పాటు ఆయన అనుచరులు సూరి అలియాస్‌ అల్లి సుదర్శన్‌, యంజాల సుధాకర్‌రెడ్డి కబ్జాకాండ సాగిస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెరపైకి రిటైర్డ్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి
మంత్రి ఈటల భూకబ్జాల వ్యవహారాన్ని మెదక్‌ జిల్లా రిటైర్డ్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి వెలుగులోకి తెచ్చారు. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలంలో మంత్రి భూ ఆక్రమణలకు పాల్పడినట్లుగా తెలిపారు. 130/5, 130/10, 64/6 సర్వే నంబర్లలో కబ్జా జరిగింద న్నారు. రిజిస్ట్రేషన్‌ కుదరదన్నా అధికారులపై ఒత్తిడి తెచ్చి భార్య జమున, కొడుకు నితిన్‌రెడ్డి పేరుతో అసైన్డ్‌ భూములను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారన్నారు.
25ఎకరాల కోసం మంత్రి సంప్రదించా రు: మాజీ అడిషనల్‌ కలెక్టర్‌ నగేష్‌
జమున హ్యాచరీస్‌ పక్కన 25 ఎకరాల భూమి ఉంది. ఆ 25 ఎకరాల భూమిని ఇవ్వాలని ఈటల సంప్రదించారు. నేను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిం చాను. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌ వ్యక్తులకు అసైన్డ్‌ ల్యాండ్‌ ఇవ్వడం కుదరదని చెప్పాను. ప్రస్తుతం ఆ భూమి మంత్రి ఆధీనంలోనే ఉంది. వాస్తవానికి ఆ భూములు బలహీన వర్గాల వారికి చెందినవి. ఈ విషయంలో నేనేం చేయలేనని మంత్రికి చెప్పాను.
రాత్రికి రాత్రే రోడ్డు వేశారు రవిగౌడ్‌, అచ్చంపేట రైతు.
మా భూమిలో అనుమతి లే కుం డానే రాత్రికి రాత్రే రోడ్డు వేశా రు. మాది 1.5 ఎకరాల భూమి తో పాటు మరో 15 మంది భూమి కలిసి మొ త్తం 30 ఎకరాల భూమి లో రో డ్డు వేయడం జరిగింది. మా అను మతి లేకుండా వేసిన ఈ రోడ్డును వెంటనే తొలగించాలని కోరు తున్నాం.
నిన్ననే తెలిసింది : శ్రీనివాస్‌, అచ్చంపేట, రైతు
మా భూమిలో రోడ్డు వేస్తున్న విషయం మాకు నిన్ననే తెలిసింది. ఈ విషయం తెలియడంతో అక్క డికి చేరుకుని ఆందోళనకు దిగాం. వారితో వాదనకు దిగడంతో రెండు రోజుల్లో రోడ్డును తొలగిస్తాం అన్నా రు. లేకుంటే ఏమైనా చేసుకో మ్మని చెప్పారు. దీంతో మేము వెను దిరిగాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement