Tuesday, April 23, 2024

స‌ర్కార్ బ‌డుల్లో డిజిట‌ల్ పాఠాలు…

హైదరాబాద్‌, : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కార్పొరేట్‌ స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తామని, ప్రతి ఏడాదికి ఇందుకోసం రూ.2వేల కోట్లతో బృహత్తర విద్యాపథకం అమలు చేయ నున్నట్లు మంత్రుల సబ్‌కమిటీ తెలిపింది. హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో గురు వారం మంత్రుల ఉపసంఘం భేటీ అయింది. ఈ భేటీలో మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు.
ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను విద్యాశాఖ అధికారులు సమావేశంలో మంత్రులకు వివరించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంగ్లీష్‌ మీడియంలో గురుకులాలను ఏర్పాటు చేశారని మంత్రుల ఉపసంఘం తెలిపింది. ప్రజలకు నాణ్యమైన విద్య అందినప్పుడే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయన్న సీఎం ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో విద్యారంగంలో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నది.
ప్రభుత్వ విద్యావ్యవస్థపై నమ్మకం కలిగించాలన్న ఆలోచనతో నాణ్యమైన విద్యను ప్రభుత్వ స్కూళ్లలో అందించేందుకు ఇప్పటికే అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు ఉపసంఘం పేర్కొంది. ప్రాథమిక విద్యారంగం పటిష్టతతోనే ఉన్నత విద్య సమర్థంగా అమలవుతున్నదని తెలిపింది. సామాజిక దృక్పథంతో విద్యారంగంపై అధిక నిధులు ఖర్చు చేయబోతున్నట్లు సబ్‌ కమిటీ సమావేశంలో తెలిపింది.
డిజిటల్‌ తరగుతులు, నూతన భవనాలు…
నూతన విద్యాపథకం ద్వారా ప్రభుత్వ విద్యారంగం కొత్త పుంతలు తొక్కనుంది. ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన నూతన భవనాలు, డిజిటల్‌ తరగతుల లాంటి కార్పొరేట్‌ స్థాయి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రులు తెలిపారు. అవసరమైన అదనపు గదులు, తాగునీరు, డిజిటల్‌ తరగతులను కూడా ఏర్పాటు చేయ నున్నట్లు పేర్కొన్నారు. ఏటా రూ.2వేల కోట్లతో మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు తుది మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను మంత్రుల ఉపసంఘం ఆదేశించింది. ఆ నివేదికను సీఎం కేసీఆర్‌కి నివేదిస్తామని, దానిపై సీఎం తుదినిర్ణయం తర్వాత బృహత్తర నూతన విద్యా పథకం పనులు ప్రారంభమవుతాయని మంత్రులు వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణరావు, పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, కార్యదర్శి రఘునందన్‌ రావు, విద్యాశాఖ సంచాలకులు దేవసేన పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement