Friday, March 29, 2024

అన్ని రంగాల్లో హైద‌రాబాద్ అభివృద్ధి : మంత్రి తలసాని

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ మహానగరం అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం సికింద్రాబాద్ లోని సెయింట్ ఆన్స్ స్కూల్ వద్ద 5 కోట్ల రూపాయాల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించిన పుట్ ఓవర్ బ్రిడ్జిని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే సాయన్న, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, బేవరేజేస్ చైర్మన్ గజ్జెల నగేష్ లతో కలిసి ప్రారంభించారు. ఈ పుట్ ఓవర్ బ్రిడ్జి కు రెండు వైపులా లిఫ్ట్ లు, ఎస్కలేటర్ లను ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు 8 సీసీ కెమెరాలను కూడా అమర్చారు. వృద్దులు, చిన్నారులు సైతం ఎంతో సులువుగా ఎక్కి రోడ్డును దాటే విధంగా పుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో వేలాది కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాపిక్ సమస్యను పరిష్కరించడం కోసం నూతనంగా ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ ల నిర్మాణం తో పాటు రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనులు కూడా కొనసాగుతున్నాయని వివరించారు. పాదచారులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు పుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కై వాక్ లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. GHMC పరిధిలో ఇప్పటి వరకు 7 పుట్ ఓవర్ బ్రిడ్జిలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, మరో 22 బ్రిడ్జిల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని త్వరలోనే వాటిని కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. అంతేకాకుండా నాలాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు గాను సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం క్రింద నాలాల అభివృద్ధి తో పాటు పూడిక తొలగింపు పనులు జరుగుతున్నాయని తెలిపారు. నాలాల అభివృద్ధి తో ఎన్నో సంవత్సరాల నుండి నాలా పరిసర ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు దీపిక, కొలన్ లక్ష్మి, మహేశ్వరి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, SE అనిల్ రాజ్, DC ముకుంద రెడ్డి, EE సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement