Tuesday, April 23, 2024

నాలాలో ప‌డి చిన్నారి మృతి.. ఆర్థిక సాయం అంద‌జేసిన త‌ల‌సాని

గత నెల 29న సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కళాసిగూడ నాలాలో పడి మరణించిన చిన్నారి మౌనిక కుటుంబానికి సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల ఆర్థిక సహాయం చెక్కును మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు వారి నివాసంలో అందజేశారు. చిన్నారి మౌనిక మృతిఘటన చాలా బాధాకరమని మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమ బిడ్డను తలుచుకుంటూ రోధిస్తున్న మౌనిక తల్లిదండ్రులు శ్రీనివాస్, రేణుకలను మంత్రి ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభంశుభం తెలియని చిన్నారి మృతి ప్రతి ఒక్కరినీ ఎంతో కలచి వేసిందని చెప్పారు. ఎంతచేసినా చిన్నారి లేని లోటును ఆ కుటుంబానికి తీర్చలేనిదని పేర్కొన్నారు.

నిరుపేదరికంలో ఉన్న మౌనిక కుటుంబం అవసరాలను తెలుసుకొని వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక చొరవతో నగరంలో కోట్లాది రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న వరదముంపు సమస్య శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టి నాలాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగానే పలు కాలనీలు, బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న వరద సమస్యను పరిష్కరించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ సుదర్శన్, స్థానిక నాయకులు ఆంజనేయులు, విజయ్, భాస్కర్, జగత్ రావు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement