Tuesday, April 23, 2024

సోనూసూద్ సాయంతో కోలుకున్న హైదరాబాదీ బాడీ బిల్డర్

కరోనా కారణంగా చావు అంచులకు చేరుకున్న హైదరాబాద్‌కు చెందిన ఓ బాడీబిల్డర్ ప్రముఖ నటుడు సోనూసూద్ సాయంతో ఆ మహమ్మారి నుంచి బయటపడి కోలుకుంటున్నాడు. నగరంలోని మల్కాజిగిరికి చెందిన సుశీల్ కుమార్ గైక్వాడ్ (32) బాడీబిల్డింగ్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఏప్రిల్ చివరిలో కరోనా బారినపడిన సుశీల్ కుమార్ చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేరాడు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో ఆక్సిజన్ సౌకర్యం ఉన్న మరో ఆసుపత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు భావించినప్పటికీ బెడ్లు దొరక్కపోవడంతో ఆందోళన మొదలైంది.

దీంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే నటుడు సోనూసూద్ సాయం అర్థించారు. ఆయన వెంటనే స్పందించడంతో మే 19న సుశీల్ కుమార్ మలక్‌పేటలోని యశోద ఆసుపత్రిలో చేరాడు. అప్పటికే అతడి ఊపిరితిత్తులు 80 శాతం ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్టు వైద్యులు గుర్తించారు. సుదీర్ఘ చికిత్స అనంతరం ఎక్మో చికిత్స అవసరం లేకుండానే సుశీల్ కోలుకున్నాడు. దీంతో తాజాగా సుశీల్ కుమార్‌ను డిశ్చార్జ్ చేసినట్టు వైద్యులు తెలిపారు. కొవిడ్ సోకకముందు 100 కిలోలకు పైగా ఉన్న సుశీల్ కుమార్ ప్రస్తుత బరువు 72 కిలోలకు తగ్గిపోయిందని చెప్పారు. కాబట్టి తాము యువకులమని, ఆరోగ్యంగా ఉన్నామని, కరోనా తమను ఏమీ చేయలేదన్న అపోహలు వీడాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement