Saturday, April 20, 2024

ఇంట‌ర్మీడియట్ లో కోర్సు ఏదైనా ఇంజ‌నీరింగ్…..

హైదరాబాద్‌, : ఇంజనీరింగ్‌ విద్యలో భారీ మార్పులకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) శ్రీకారం చుట్టింది. ఇంటర్మీడియట్‌లో బయాలజీ, బయోటెక్నాలజీ చది‌వినప్పటికీ ఇంజనీరింగ్‌లో ప్రవేశం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏఐసీటీఈ మార్గదర్శకాలు రూపొందించింది. 2021-22 విద్యా సంవ త్సరం నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది. ఏఐసీటీఈ తాజాగా విడుదల ఈ మార్గదర్శ కాల నేపథ్యంలో ఈనెల 18న ప్రకటించనున్న ఎంసెట్‌ షెడ్యూల్‌ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంజనీరింగ్‌లో ప్రవేశం పొందాలంటే ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులు ఖచ్చితంగా చదవాలన్న నిబంధన ఇప్పటి దాకా అమల్లో ఉండేది. అయితే విదేశీ విశ్వ విద్యాల యాలతో పాటు దేశంలోని డీవ్డ్‌ు విశ్వవిద్యాలయాలు ఇంజ నీరింగ్‌లో ప్రవేశానికి ఇంటర్‌లో ఖచ్చితంగా ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ చదివి ఉండాలన్న నిబంధనను తొలగించడంతో ఏఐసీటీఈ కూడా ఇదే విధానాన్ని అవలంబించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇంటర్‌లో బయాలజీ, ఫిజిక్స్‌, మ్యాథమేటిక్స్‌, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇన్ఫర్‌మ్యాటిక్స్‌ ప్రాక్టిసెస్‌, బయో టెక్నాలజీ, ఒకేషనల్‌ కోర్సులు, అగ్రికల్చర్‌, ఇంజనీరింగ్‌ గ్రాఫిక్స్‌, బిజినెస్‌ స్టడీస్‌ ఇలా ఏ కోర్సు చదివినా ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరేందుకు అనుమతించాలని నిర్ణయించింది. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశానికి సంబంధించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి తగు నిర్ణయం తీసుకోవా లని ఏఐసీటీఈ సూచించినట్టు సమాచారం. ఇంటర్‌లో 45 శాతం జనరల్‌ విద్యార్థులకు, 40 శాతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు మార్కులు సాధించినా ఇంజనీరింగ్‌ కోర్సుల్లో అర్హులుగా ప్రకటించాలని కూడా ఏఐసీటీఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా మార్గదర్శకాల ప్రకారం బైపీసీ చదివిన విద్యార్థులు సైతం ఇంజనీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ వంటి కోర్సుల్లో చేరే అవకాశం దక్కింది. ఇంజనీరింగ్‌ విద్యలో వస్తున్న మార్పులను గుర్తించ డంతో పాటు విద్యార్థులను పోటీ ప్రపంచానికి ధీటుగా సిద్ధం చేయాలన్న ఉద్దేశంతోనే ఇంజనీరింగ్‌ ప్రవేశాల్లో మార్పులకు ఏఐసీటీఈ శ్రీకారం చుట్టినట్టు ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడంతో పాటు పోటీ ప్రపంచంలో నిలబడి గెలవాలన్న ఉద్దేశంతో ఏఐసీటీఈ ఈ మార్పులకు శ్రీకారం చుట్టినట్టు సమాచారం.
ఏఐసీటీఈ మార్గదర్శకాలపై కమిటీని నియమించిన జేఎన్‌టీయూ
ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించి ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ తప్పనిసరి కాదని ఏఐసీటీఈ ప్రకటించడం తో ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై అధ్య యనం చేసేందుకు హైదరాబాద్‌ జేఎన్‌టీయూ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ వెనువెంటనే సమా వేశమై ఏఐసీటీఈ మార్గదర్శకాలను అధ్యయనం చేయడం తో పాటు భవిష్యత్‌ కార్యాచరణను ఖరాను చేయాలని నిర్ణయించింది. ఏఐసీటీఈ నిబంధనలను అమలు చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు, పరిణామాలపై కూడా చర్చించాలని ఈ కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ మార్గదర్శకాలనే అమలు చేయాలని భావిస్తే రాష్ట్ర ప్రభుత్వా నికి నివేదిక అందజేయాల్సి ఉంటుంది. నూతన విద్యా సంవ త్సరం మరో నాలుగైదు నెలల్లో ప్రారంభించాల్సి ఉండగా తాజాగా ఏఐసీటీఈ ఈ మార్గదర్శకాలను తీసుకురావడం పట్ల విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
మరింత ఆలస్యంగా ఎంసెట్‌ షెడ్యూల్‌
ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి హైదరాబాద్‌ జేఎన్‌టీయూ ఈనెల 18న నోటిఫికేషన్‌ జారీ చేయాలని నిర్ణయించింది. ఏఐసీటీఈ తాజా మార్గదర్శకాల నేపథ్యంలో నోటిఫికేషన్‌ విడుదలను నిలిపివేయాలన్న ఆలోచనతో వర్సిటీ ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి 18న నోటిఫికేషన్‌ జారీ చేసి 20వ తేదీనుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. జులై 5 నుంచి 9వ తేదీవరకు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ ఫార్మసీ ప్రవేశ పరీక్షల నిర్వహణకు జేఎన్‌టీయూ సిద్ధమైంది. ఎంసెట్‌ షెడ్యూల్‌తో పాటు ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించిన నియమ నిబంధనలు, సిలబస్‌ ఇతర అంశాలను పొందుపర్చాల్సి ఉండగా ఏఐసీటీఈ తాజా నిర్ణయంతో ఏం చేయాలో తెలియక ఎంసెట్‌ కమిటీ తలపట్టుకుని కూర్చుంది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డితో సంప్రదించి తాజా పరిణామాలను వివరించి ఎంసెట్‌ షెడ్యూల్‌ ప్రకటనపై తుది నిర్ణయానికి రావాలని జేఎన్‌టీయూ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై జేఎన్‌టీయూ రెక్టార్‌, ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య గోవర్దన్‌ ‘ఆంధ్రప్రభ’తో మాట్లాడుతూ ఏఐసీటీఈ మార్గదర్శకాలపై అంతర్గత కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం తదుపరి చర్యలుంటాయని ఆయన చెప్పారు. ఏఐసీటీఈ ప్రతిపాదనలపై అధ్యయనం చేశాకే ఎంసెట్‌ షెడ్యూల్‌ను ఖరారు చేసి ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement