Thursday, April 25, 2024

పైసలకు ఆశపడి ఫైటింగ్ కు వచ్చిండు.. ప్రాణాలు పోగొట్టుకున్నడు..

డబ్బులకు కక్కుర్తి పడి ఎవరినో కొట్టేందుకు వచ్చి యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్న షాకింగ్ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. మహదేవపూర్ మండలం కాళేశ్వరానికి చెందిన శ్రీనివాస్, చల్లా రమ గ్రామంలో ఎదురెదురుగా దుకాణాలు పెట్టుకున్నారు. కస్టమర్ల విషయంపై ఇద్దరి మధ్య గొడవలు మొద‌ల‌య్యాయి. గత నెలలో మరోమారు ఇద్దరికీ గొడవ జరగడంతో రమ ఎలాగైనా శ్రీనివాస్‌పై పగ తీర్చుకోవాలనుకుంది. అతన్ని కొట్టించి భయపెట్టాలని భావించి వరంగల్‌కి చెందిన వంశీని ఆశ్రయించింది. తన షాపు ఎదుట ఉన్న శ్రీనివాస్‌ని కొట్టేందుకు డీల్ కుదుర్చుకుని సుపారీ రూ.25 వేలు ఇచ్చింది.

రంగంలోకి దిగిన వంశీ ఖిలావరంగల్ మండలం రంగశాయిపేటకు చెందిన తన స్నేహితులు అస్లాం, అల్తాఫ్, వాసిముద్దీన్, వెంకట్, సాయితేజను కాళేశ్వరం రప్పించారు. అందరూ కలసి ఫుల్లుగా మద్యం తాగిన తర్వాత శ్రీనివాస్ షాపు వద్దకు వెళ్లారు. సిగరెట్ కొంటున్నట్లు నటిస్తూ ధర విషయమై శ్రీనివాస్‌తో గొడవపడ్డారు. పక్కనే ఉన్న ఇనుప వస్తువుతో శ్రీనివాస్‌పై దాడి చేశారు. దీంతో శ్రీనివాస్, అతని భార్య ఎదురుతిరగడంతో కథ అడ్డం తిరిగింది. నలుగురు యువకులపై దంపతులు ఎదురుదాడికి దిగారు. గ్యాస్‌ స్టవ్ తీసుకుని సాయితేజ తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు.

అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు దంపతులను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఎదురు షాపు నిర్వహిస్తున్న చల్లా రమతో గొడవలున్నట్లు తేలింది. ఆమెను కూడా అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించడంతో అసలు విషయం బ‌య‌ట ప‌డింది. దంపతులతో పాటు సుపారీ గ్యాంగ్ ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్, టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement