Thursday, April 25, 2024

ప‌ట్ట‌ణాల‌ ప్ర‌గ‌తికి నిధులు.. అభివృద్ధే టీఆర్ఎస్ ప్ర‌ధాన ధ్యేయం: ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్

మ‌రిపెడ‌, (ప్ర‌భ న్యూస్‌): ప‌ట్ట‌ణాల అభివృద్ధే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తుంద‌ని, భ‌విష్య‌త్ కాలంలో పెర‌గ‌నున్న‌ జ‌నాభా, ప‌ట్ట‌ణాల భౌగోళిక విస్తిర్ణ‌త‌కు అనుగుణంగా తాగునీటీ వ‌స‌తులు క‌ల్పించేందుకు రాష్టంలోని అన్ని ప‌ట్ట‌ణాల‌కు అమృత బిందు పేరుతో రాష్ట ప్ర‌భుత్వం నిధులు మంజూరు చేస్తోంద‌న్నారు ఎమ్మెల్యే రెడ్యా నాయ‌క్‌. అందులో భాగంగా మ‌రిపెడ ప‌ట్ట‌ణానికి రూ.25కోట్లు మంజూరైన‌ట్లు స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం ఆయ‌న మ‌రిపెడ మునిసిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ గుగులోత్ సింధూర ర‌వి అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన ప‌ట్ట‌ణ కౌన్సిల్ స‌మావేశానికి జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మెన్ గుడిపూడి న‌వీన్ రావుతో క‌లిసి ముఖ్యఅతిథిగా హాజ‌రైయ్యారు. ఈ సంద‌ర్భంగా మునిసిప‌ల్ పాల‌క వ‌ర్గం 2021-2022 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి చేప‌ట్టిన‌ ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తికి ప‌నుల పెండింగ్ బిల్లుల చెల్లింపులు, సిబ్బంది వేత‌నాల చెల్లింపులు త‌దిత‌ర అంశాల‌ను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువ‌చ్చి ఆమోదింపజేశారు.

రాబోయే రోజుల్లో ప‌ట్ట‌ణ పెరుగుద‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌భుత్వం ముందుగానే అన్ని విధాల స‌న్నద్ధం అవుతోంద‌ని, భ‌విష్య‌త్ రోజుల్లో ప్ర‌జలు ఏ విధ‌మైన ఇబ్బందులు ఎదుర్కొకుండా ఉండేందుకు తెరాసా ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు చేప‌డుతోంద‌న్నారు. అందులో భాగంగానే రాష్ట ప్ర‌భుత్వం ప‌ట్ట‌ణాల భౌగోళిక విస్తిర్ణం పెరిగే క్ర‌మంలో పుర వాసుల‌కు తాగునీటి ఇబ్బందులు క‌లుగ‌కుండా అమృత బిందు ద్వారా నూత‌న ఓవ‌ర్ హెడ్ ట్యాంకులు, కొత్త పైప్ లైన్లు వేయ‌నున్న‌ట్లు తెలిపారు. డోర్న‌క‌ల్ నియోజిక వ‌ర్గంలోని రెండు మునిసిపాలిటీల‌కు క‌లిపి రూ.50కోట్లు రాష్ట ప్ర‌భుత్వం మంజూరు చేసింద‌న్నారు. అదే విధంగా ఈ నెల 20వ తేదీ నుంచి ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం ప్రారంభం కానుంద‌ని అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాల‌ని సూచించారు. ప‌ట్ట‌ణాన్ని ప‌రిశుభ్రంగా ఉండేలా చూడాల‌ని, క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల‌కు ఉన్న స‌మ‌స్య‌లు, రానున్న వ‌ర్షాకాలంలో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల గురించి ప్ర‌ణాళిక‌లు రూపొందించుకోవాల‌న్నారు. జాతీయ ర‌హ‌దారి 365 నుంచి మునిసిప‌ల్ కార్య‌ల‌యం మీదుగా తిరిగి గ్రామం బ‌య‌ట నేష‌న‌ల్ హైవేకు క‌లిపే లింక్ రోడ్డును ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిలో భాగంగా సుమారు రూ.30ల‌క్ష‌ల వ్య‌యంతో బీటీ వేయ‌నున్న‌ట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement