Thursday, March 28, 2024

ఎంబీబీఎస్‌ సీట్ల పేరుతో మోసం, నేపాల్‌లో ఒకరి అరెస్టు.. మరో అయిదుగురి కోసం గాలింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎంబీబీఎస్‌ సీట్లు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడిన అశోక్‌షా అనే వ్యక్తిని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు నేపాల్‌లో అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో అయిదుగురి కోసం గాలింపును ముమ్మరం చేసారు. కోల్‌కత్తా, బెంగళూరు, పూణేల్లో ఎంబీబీఎస్‌ సీట్లు ఇప్పిస్తామని నమ్మించి అశోక్‌షా ముఠా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కోల్‌కత్తా, పూణే, బెంగళూరులలో కూడా అశోక్‌కు కార్యాలయాలున్నాయని, హైదరాబాద్‌లో ఈ ముఠాపై మూడు కేసులు నమోదైనట్లు పోలీసులు చెప్పారు.

నీట్‌ పరీక్ష రాసిన వారే లక్ష్యంగా అశోక్‌ మోసాలకు తెరలేపాడని తెలిపారు. మంచి కళాశాలల్లో సీట్లు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ. 10 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. బీహార్‌ రాష్ట్రానికి చెందిన అశోక్‌షా కొంత కాలంగా ఈ మోసాలకు పాల్పడుతున్నాడని, తెలంగాణతో పాటు వేర్వేరు రాష్ట్రాలలో కేసులు నమోదవడంతో నేపాల్‌ పారిపోయాడని, నేపాల్‌లో తలదాచుకున్న అతడిని అరెస్టు చేసి హైదరాబాద్‌ తీసుకువచ్చామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement