Friday, March 29, 2024

Fake IT Raid – నగల షాపు నుంచి రెండున్న‌ర కిలోల బంగారంతో ఉడాయింపు…

హైదరాబాద్‌లోని మోండా మార్కెట్‌లోని నగల షాపులోకి ఐటీ అధికారుల మంటూ వచ్చిన కొందరు దుండుగులు అందరి కళ్లు గప్పి రెండున్నర కిలోల బంగారంతో పరారయ్యారు. హర్షా జ్యువెలరీస్‌ దుకాణ యజమానులు తెలిపిన వివ‌రాలు ప్రకారం నలుగురు వ్యక్తులు ఆదాయపు పన్ను అధికారులమంటూ మోండా మార్కెట్లోని హర్షా జ్యూయెలరీస్ లోకి వచ్చారు. తనీఖీలు చేపట్టాలంటూ బంగారం తీసుకున్నారు. ఆ రెండున్న‌ర కిలోల బంగారానికి బిల్లులు లేవంటూ వాటితో పరారయ్యారని బాధితులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి బాధితులు మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు. నలుగురు ఈ దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. బంగారం షాపు యజమానికి ఎలాంటి అనుమానం రాకుండా ఐటీ అధికారులు ఏ విధంగా సోదాలు చేస్తారో అదే పద్ధతిని అనుసరించారు. దుకాణంలో పనిచేస్తున్న సిబ్బంది అందరినీ ఒక పక్కన కూర్చోబెట్టి తనిఖీలు చేశారని పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. దోపిడీ తర్వాత నిందితులు సికింద్రాబాద్‌ నుంచి ఉప్పల్‌ వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement