Wednesday, March 27, 2024

దద్దరిల్లిన దండకారణ్యం.. లోదేడు కొత్తపల్లి గుట్టలో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి

వాజేడు అక్టోబర్25 (ప్రభ న్యూస్ ): తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా లోదేడు కొత్తపల్లి అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టులకు మధ్య ఈరోజు తెల్లవారుజామున భీకరమైన ఎదురు కాల్పులు జరిగాయి. గంటపాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి చెందారు.

ఇరు వర్గాల మధ్య జరిగిన ఎదురు కాల్పులతో దండకారణ్యం దద్దరిల్లింది. ఎన్ కౌంటర్ లో చ‌నిపోయిన‌ మావోయిస్టుల వద్ద ఎల్ఎన్జి ఎస్ ఎల్ ఆర్, ఒక ఏకే 47 తో పాటు విప్లవ సాహిత్యం పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న‌ట్లు సమాచారం. తెలంగాణ సరిహద్దు ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు పోలీస్ స్టేషన్ పరిధికి సమీప ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్ర అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ సంభవించడంతో సరిహద్దు ప్రాంతంలోని మండలాల పోలీసులను అప్రమత్తం చేశారు.

ప్రశాంతంగా ఉన్నటువంటి వాజేడు మండల ప్రాంతం ఈ ఎన్ కౌంటర్ తో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను ములుగు జిల్లాకు తరలిస్తున్నట్లు సమాచారం. వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్ లో కంపెనీ-2కు చెందిన కామ్రేడ్స్ నరోటి దామాల్ మహారాష్ట్ర గడిచిరోలి జిల్లా గట్ట ఏరియా, పూనెం బద్రు గ్రామం పెద్ద కోర్మ జిల్లా బీజా పూర్, సోడి రామాల్ (సంతోష్) బీజాపూర్ జిల్లా బాసగూడెం ప్రాంతం మల్లి పాడుకు చెందిన వారు చ‌నిపోయిన‌ట్టు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement