Friday, April 19, 2024

ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా బాట‌లో ఈట‌ల‌…..

హైదరాబాద్‌, : తాను ప్రేమతోనే లొంగుతాను తప్ప భయపెడితే లొంగిపోయే వాడిని కాదని, చావునైనా భరిస్తా కానీ.. ఆత్మాభిమానాన్ని అమ్ముకోనని మంత్రివర్గం నుండి బర్తరఫ్‌కు గురైన ఈటల రాజేందర్‌ ప్రకటించారు. మంత్రివర్గం నుండి తొలగించిన అనంతరం మీడి యా సమావేశంలో మాట్లాడిన ఆయన తన నియోజ కవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ వెల్లడిస్తానన్నారు. గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన తనపై ఆ దిశగా కూడా కేసులు పెట్టొచ్చని అన్నారు. తన ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి అరెస్ట్‌ చేస్తారని భయోత్పాతం సృష్టిస్తున్నార న్నారు. మానవ సంబంధాలు శాశ్వతమని, ఎన్ని రోజులు జైల్లో పెడతావు.. అసెంబ్లి లో పేగులు బయట పడేలా తెలంగాణ కోసం కొట్లాడానని అన్నారు. తన ఆస్తులపై నిజయితీగా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, తాను చేసే పని ఆత్మగౌరవ సమస్య అని తెలిపారు. నేను చెడు పని చేసి దూరం కాలేదు.. మమ్ములను మంత్రులుగా కాకున్నా మనుషులుగా చూడండని అంటున్నామని పేర్కొన్నారు. మీ దగ్గర ఉన్న ఏ ఒక్క మంత్రి ఆత్మ గౌరవంతో లేరని, చట్టాన్ని, సిస్టమ్‌ను పక్కన పెట్టి పని చేస్తున్నారని అన్నారు. పార్టీ పెడతానని.. పార్టీ మారతానని తాను ఎప్పుడూ చెప్పలేదని ఉద్ఘాటించారు. కారు గుర్తుపై గెలిచినందున రాజీనామా చేయమని అడగవచ్చని వ్యాఖ్యానించారు. తాను కూడా రాజీనామా చేయా ల్సి ఉంటుందని తెలిపారు. ఈటల రాజేందర్‌ పద వుల కోసం పెదవులు మూయడని వెల్లడించారు. కేసీఆర్‌ ఏ విధంగా పగ బడతారో అందరికి తెలుసు. ఒకసారి కేసీఆర్‌ తలుచుకుంటే అవతల వ్యక్తి పరిస్థితి ఏంటి అనేది తనకు బాగా తెలుసని పేర్కొన్నారు. నిన్నటిదాకా తమ్ముడినైన నేను.. ఈరోజు దెయ్యంలా కనబడుతున్నానన్నారు. నా కార్యకర్తలు ఆవేశానికి లోనై ఏమీ చేయొద్దని సూచించారు.
నివేదిక తప్పుల తడక
తనపై వస్తున్న ఆరోపణలపై నిష్పాక్షికంగా విచా రణ జరపాలని, కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు విచారణ చేశారని.. వావివరసలు లేకుండా నివేదికలో పేర్కొన్నారని ఈటల రాజేందర్‌ అన్నారు. జమునా హేచరీస్‌కు తనకు ఏ సంబంధం లేదని, న్యాయపరంగా ఈ అంశాన్ని ఎదుర్కొంటామన్నారు. ప్రభుత్వంలో ఒక కమిట్‌మెంట్‌ తో పనిచేశానని ఎపుడూ చిల్లర పనులు చేయలేదన్నారు. గులాబీ కండువా వేసుకున్న ప్రతి కార్యకర్తకు ఓనర్‌ అనే ఫీలింగ్‌ ఉంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement