Friday, April 26, 2024

కామెడీ చేయొద్దు.. తలసానికి జగ్గారెడ్డి సవాల్

రెమిడెసివర్ ఇంజక్షన్ తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నా.. ఇక్కడే దొరక్కపోవడం లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రెమిడెసివర్ రాష్ట్రంలో ఎక్కడ దొరక్క కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు సరైన వైద్యం అందక పిట్టల్లా రాలిపోతున్నారని చెప్పారు. రెమిడెసివర్‌ను రాష్ట్రానికి ప్రత్యేక కోటా కేటాయించాలని కేంద్రాన్ని జగ్గారెడ్డి  కోరారు. కేంద్రం తెలంగాణ ను అశ్రద్ద చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి పెట్టడం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు అవసరమైన వ్యాక్సిన్లు, మందులను కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి తీసుకురాకుండా ఇక్కడి బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని జగ్గారెడ్డి నిలదీశారు. 

ప్రభుత్వం నిర్ణయించిన ధరకే మెడికల్ షాపుల్లో రెమిడెసివర్ దొరికేలా తెలంగాణ ప్రభుత్వం  చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రజలకు సరిపడా రెమిడెసివర్ ఇవ్వాలని కేంద్రం దగ్గరకు వెళ్లి నిరసన తెలుపుతామని చెప్పారు. హైకోర్ట్ మొట్టికాయలు వేస్తుంటే చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఫార్మా అనేది ఒక మాఫియా అని.. పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్ నడుస్తోందని ప్రభుత్వం దీనిని అడ్డుకోవాలన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ చేస్తుంటే విజిలెన్స్ ఏం చేస్తోందని నిలదీశారు.

తెలంగాణ ప్రజల ప్రాణాలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కామెడీ చేయొద్దని జగ్గారెడ్డి అన్నారు. శ్రీనివాస్ యాదవ్ ఓసారి సంగారెడ్డి హాస్పిటల్‌కు వచ్చి చూడాలన్నారు. కేసులు తగ్గినయు అని రుజువు చేస్తావా ? అని సవాల్ విసిరారు.  రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న తగ్గినట్లు ప్రభుత్వం చూపిస్తోందని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకి భజన చేయకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు కూర్చోని రాష్ట్రానికి రావాల్సిన మందుల కోసం కేంద్రంపై తలసాని శ్రీనివాస్ యాదవ్ పోరాడాలని జగ్గారెడ్డి హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement