Saturday, April 20, 2024

ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బంది కలుగొద్దన్న క‌లెక్ట‌ర్ హ‌నుమంత‌రావు

సంగారెడ్డి, (ప్రభ న్యూస్): సంగారెడ్డి జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఆదేశించారు. ఈరోజు కలెక్టర్ ఆకస్మికంగా సంగారెడ్డి మండలం పసల్ వాది, చౌట కూర్ మండలం శివంపేట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ధాన్యం కొనుగోళ్ళ విషయమై రైతులను ఆరా తీశారు. కొనుగోలు కేంద్రంలోని ధాన్యం నాణ్యత ప్రమాణాలను, తేమశాతాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. కొనుగోలు కేంద్రం ఇన్ ఛార్జిలు ట్యాబ్ లో నమోదు చేస్తున్న వివరాలను, ధాన్యం నాణ్యత ప్రమాణాలను ఏ విధంగా నిర్ధారిస్తుందని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… కొనుగోలు నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే తూకం చేసి, వెంటవెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు.

సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ లో నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే దింపుకొని రసీదులు ఇవ్వాలని మిల్లర్లకు సూచించారు. ట్యాబ్ ఎంట్రీ, తూకం చేయడంలో జాప్యం చేయరాదన్నారు. జాప్యం చేస్తే సంబంధిత ఇన్ ఛార్జిల‌పై చర్యలు తీసుకుంటామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 72 గంటల్లో చెల్లింపులు జరగాలని తెలిపారు. కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకు వచ్చేటప్పుడు నిర్ధారించిన నాణ్యతా ప్రమాణాల మేరకు తేమ శాతం చూసుకొని తేవాలన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోకుండా రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యంతో పాటు తాడి పత్రీ, టార్పాలిన్ కవర్లను తెచ్చుకోవాలని సూచించారు.


ధాన్యం కొనుగోలు విషయమై రైతులు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దన్నారు. రైతులు తమ ఫోన్ నెంబర్ కు ఆధార్ అనుసంధానం చేసుకోవాలన్నారు. రైతు బంధు డాటాలో నమోదు కాని, పంట వివరాలు తప్పుగా నమోదైన రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తారని ఆయన తెలిపారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన తర్వాత రైతులు తమ ఆధార్ కార్డుకు లింక్ ఐన ఫోన్ నెంబరుకు వచ్చే ఓటిపి నెంబర్ ను కొనుగోలు కేంద్రం ఇన్ ఛార్జీకి తెలియజేయాలన్నారు. కొనుగోలు ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా రైతులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్రాల ఇన్ ఛార్జిలు, రైతులు ఉన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement