Thursday, April 25, 2024

‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణ వ్యవసాయం

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆహారం కోసం అలమటించిన తెలంగాణ నేడు దేశానికే అన్నపూర్ణగా మారడం వెనక రాష్ట్ర ప్రభుత్వ కృషిని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అనతికాలంలో రెండు పంటలకు రెండుకోట్ల ఎకరాల మాగాణాగా తెలంగాణను తీర్చిదిద్దుకున్నామని సీఎం అన్నారు. దాదాపు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యం ఉత్పత్తితో, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలోకి ఎదుగుతున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, ఆహార భద్రతను దాటి దేశానికి ఆహార భరోసాను కల్పించే స్థితికి చేరుకున్నదన్నారు.

‘‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’’ గా తెలంగాణ వ్యవసాయం రూపుదిద్దుకోవడం పట్ల సీఎం కేసీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు తెలంగాణ వ్యవసాయాన్ని, నీటిపారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేయడం మూలంగా.. సాగునీరు, తాగునీరు లేక, తెలంగాణ అల్లాడిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న అనంతరం మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పటిష్టం చేసుకుని, కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులను యుద్దప్రాతిపదికన నిర్మించుకుని నేడు ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతుండడం, తెలంగాణ సమాజం గర్వపడే సందర్భమన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రతి ఏటా రూ.45 వేల కోట్లతో వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, ప్రజలకు ఆహార భద్రతతోపాటు సామాజిక జీవన భద్రత కూడా ప్రభుత్వం కల్పిస్తున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తిండికి లోటు ఉండకూడదనే లక్ష్యంతో, ఆహార భద్రతను కల్పించడంలో భాగంగా, ఒక వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున, కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కిలో రూపాయి చొప్పున నాణ్యమైన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు.

ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే సీతక్కకు ధైర్యం చెప్పిన చంద్రబాబు.. థాంక్స్ అన్నా అంటూ..

Advertisement

తాజా వార్తలు

Advertisement