Friday, March 29, 2024

ఫారెస్ట్ ఆఫీస‌ర్ మృతి ప‌ట్ల‌ సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి.. 50 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా, అధికార లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు

భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో చ‌నిపోయిన‌ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మరణంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దోషులకు కఠినంగా శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం ఆదేశించారు. మరణించిన ఎఫ్ ఆర్ వో కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. దాడిలో మరణించిన శ్రీనివాసరావు డ్యూటీలో ఉంటే ఏ విధంగానైతే నిబంధనల ప్రకారం జీతభత్యాలు అందుతాయో అవే నిబంధనల ప్రకారం ఆయన కుటుంబానికి పూర్తి వేతనాన్ని అందించాలని, రిటైర్ మెంట్ వయస్సు వరకు వారి కుటుంబ సభ్యులకు ఈ వేతనం అందజేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎఫ్ ఆర్ వో పార్థివ దేహానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. అటవీశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎఫ్ ఆర్ వో అంత్యక్రియల్లో పాల్గొని సంబంధిత ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఏమాత్రం సహించబోమని ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement