Saturday, April 20, 2024

ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో క్రిస్మ‌స్ వేడుక‌లు… మంత్రి త‌ల‌సాని

ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి క్రిస్మస్ వేడుకల నిర్వహణపై నగరంలోని ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారన్నారు. ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ సందర్బంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. క్రిస్మస్ ను పేదలు కూడా సంతోషంగా జరుపుకోవాలనే ఆలోచనతో పేదలకు ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్ లు (దుస్తులు) పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో విందును ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ విందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరవుతారని తెలిపారు.

అదేవిధంగా ఒక్కో నియోజకవర్గ పరిధిలో 8 ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల సహకారంతో చర్చి కమిటీ ప్రతినిధులతో సమావేశాలను నిర్వహించి డిన్నర్, గిప్ట్ ప్యాక్ ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ప్రాంతానికి 500 చొప్పున గిప్ట్ ప్యాక్ లు, డిన్నర్ నిర్వహణ కోసం ఒక లక్ష రూపాయల చొప్పున అందించనున్నట్లు వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని పండుగలకు ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని వివరించారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యేల‌ సమన్వయంతో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల‌కు అందజేయాలని, వాటిని ఆయా నియోజకవర్గాల పరిధిలోని చర్చి కమిటీల ప్రతినిధులకు అందజేస్తారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని, పండుగలు గొప్పగా జరుపుకోవాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన, ప్రభుత్వ ఉద్దేశమ‌ని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండలి ప్రభుత్వ విప్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీలు స్టీఫెన్ సన్, సురభి వాణి దేవి, హసన్ జాఫ్రీ, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాద్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, కౌసర్ మొహినోద్దిన్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఎండీ కాంతి వెస్లీ, ప్రాజెక్ట్ డైరెక్టర్ సౌజన్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement