Thursday, April 25, 2024

వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్రం కుట్రలు.. మిల్లర్లపై ఎఫ్​సీఐ దాడులపై మంత్రి హరీశ్‌ రావు ఫైర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తడిసిన ధాన్యం ఆరబెట్టి కొనుగోలు చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు నీట మునిగి, మరోవైపు కోసిన ధాన్యం వరద నీటిలో తడిసిపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. తడిసిన ధాన్యం కొనుగోలుకు ఈ మేరకు సంసిద్ధత వ్యక్తం చేసింది. సిద్ధిపేట మార్కెట్‌ యార్డును గురువారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను పరిశీలించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అకాల వర్షాలతో చాలా చోట్ల వరిధాన్యం తడిసిపోయిందన్నారు. తడిసిన ధాన్యం ఆరబెట్టి మిల్లర్లతో కొనుగోలు చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించిందని పేర్కొన్నారు. మార్కెట్‌ యార్డులో తడిసిన ధాన్యం ఆరబెట్టేలా సకల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

సిద్దిపేటలో పండిన పంట అంతా కొనే విధంగా 600 ప్యాడీ క్లీనర్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. 421 కొనుగోలు కేంద్రాలను జిల్లాలో ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో అనేకచోట్ల సెంటర్లలో కొనుగోలు ప్రారంభమైందన్నారు. ఇందుకు 4 వేల టార్పాలిన్‌ కవర్లు ఒక్క సిద్దిపేటలో కొనుగోలు చేయడం జరిగిందని, ఎక్కడా ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు వెల్లడించారు. రైతులు ప్రభుత్వంతో స#హకరించి కళ్లంలోనే ఆరబెట్టి ధాన్యం తెస్తే, ఆదే రోజు కొనడానికి అవకాశం ఉంటుందని సూచించారు. ఆరబెట్టకుండా మార్కెట్‌ యార్డుకు, ఐకేపీ సెంటర్లకు తెస్తే వర్షానికి తడిసిపోతున్నాయని, లోతట్టు ప్రాంతంలో ఆరబొస్తే అకాల వర్షం వల్ల ధాన్యం తడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడైనా పండిన పంట కొనే వ్యవస్థ ఉంది. కాని తెలంగాణ వడ్లు కొనమని మొట్టమొదటి సారి బీజేపీ ప్రభుత్వం మొండికేసి తొండాట ఆడుతుందన్నారు. రా రైస్‌ కొంటం, బాయిల్డ్‌ రైస్‌ కొనం అన్నరు. వేసవిలో తెలంగాణలో బాయిల్డ్‌ రైస్‌ మాత్రమే వస్తుంది. అయినా తెలంగాణ ప్రభుత్వం రూ. 3 వేల కోట్ల భారాన్ని భరించి రైతులను కాపాడాలని, రైతులకు మద్ధతు ధర కావాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కక్ష్య కట్టిన కేంద్ర ప్రభుత్వం రైతుల నుండి వడ్లు కొనుగోలు చేసే సమయంలో 2900 రైస్‌ మిల్లులపై దాడులు చేయిస్తోందని, ఒక నెల ఆగి దాడులు చేస్తే ఏమవుతుందని ప్రశ్నించారు.

దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. రైతులు నష్టపోవాలి. వడ్లు కొనొద్దు అన్న కారణంతో ఎఫ్‌.సీఐ అధికారులతో దాడులు చేయిస్తోంది. మిల్లు యాజామాన్యాలను తమ ఆధీనంలో ఉంచుకుని సీజ్‌ చేస్తున్నరు. లారీలలో వడ్లు మిల్లుకు వెళ్తే దించే పరిస్థితి లేదు. మేం తనిఖీలు చేయవద్దని అనడం లేదు. ఒక్క నెల అయితే మా ధాన్యం కొనుగోలు పూర్తవుతదని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వడ్లు కొనుగోలు చేయకపోతే తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలి. రైతుల వడ్లు కొనొద్దని చూస్తున్నరు. కుట్రతో కేంద్రం వ్యవహరిస్తోంది. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సోదరులు దీన్ని గమనించాలి. 2990 మిల్లుల మీద రైడ్‌ చేస్తరా ? ఇప్పుడు చేయడం వల్ల రైతులకు ఇబ్బంది అవుతుందని అన్నారు. వడ్లు కొనబోమని తొండాట ఆడారు. కొనకపోతే తెలంగాణకు చెడ్డ పేరు రావాలని చూశారు. సీఎం కేసీఆర్‌ రూ. 3 వేల కోట్లతో కొనాలని నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు రైతులు మిల్లర్ల వద్ద ధాన్యం దింపకుండా చేస్తోంది. తడిస్తే రైతులు ఇబ్బంది పడేలా, తెలంగాణ ప్రభుత్వంపై కోపం వచ్చేలా కుట్రలు చేస్తోంది అని మండిపడ్డారు.

తెలంగాణ రైతాంగం బీజేపీ కుట్రలు గమనించాలి. నల్ల చట్టాలు తేలేదు కాని, నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చారు. బావులకాడ మీటర్లు పెట్టాలంటున్నారు. డిజీల్‌ ధరలు పెంచారు. ట్రాక్టర్‌తో దున్నడానికి ఎకరానికి ఐదు వేలు ఖర్చు అవుతుంది. వరి కోత మిషన్‌తో పని ఇప్పుడు రెండు వేలు దాటింది. ఎరువుల ధరలు పెంచారు అని కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రైతులకు కేంద్రం చేసిన ఒక్క మంచి పని ఏదైనా ఉందా.. తనిఖీల పేరుతో మిల్లర్లు వడ్లు కొనుగోలు చేయకుండా చేస్తున్నరు. మిల్లుల ముందు లారీలతో ధాన్యం వచ్చాక ఎఫ్‌.సీ.ఐ అధికారులు మిల్లులో కూర్చోని ఇబ్బంది పెడుతున్నరు. దీన్ని విరమించుకోవాలి అని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement