Tuesday, April 16, 2024

celebrations : తెలంగాణ ప్రగతి ప్రతిబింబించేలా ‘దశాబ్ది’ సంబురాలు .. మంత్రి పువ్వాడ

కొత్తగూడెం : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఅర్ ఆదేశానుసారం అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ, పల్లెపల్లెన తెలంగాణ ప్రగతిని ఆవిష్కరింపజేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సహకారంతో పనిచేస్తూ దశాబ్ది ఉత్సవాల విజయవంతానికి అంకిత భావంతో కృషి చేయాలని వారిని కార్యోన్ముఖులు చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ అధ్వర్యంలో దశాబ్ది ఉత్సవ ఏర్పాట్లపై అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమావేశమై వారికి దిశా నిర్దేశం చేశారు.
ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, అన్ని వర్గాల వారి కృషితో గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను పునఃశ్చరణ చేసుకుంటూ ప్రజలకు వీటి గురించి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను చేపడుతోందన్నారు.

పండుగ వాతావరణంలో ఉత్సాహభరితంగా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని మంత్రి సూచించారు. అందరి సహకారం, భాగస్వామ్యంతోనే వేడుకలు విజయవంతం అవుతాయన్నారు. తొమ్మిదేళ్లలో సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, వివిధ వర్గాల ప్రజలకు చేకూరిన మేలు గురించి శాఖల వారీగా కరపత్రాలు, ఫ్లెక్సీలు, బుక్ లెట్ల ద్వారా తెలియజేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా వ్యవసాయం, విద్యుత్, సాగునీటి రంగం, పారిశ్రామిక ప్రగతి, విద్య, వైద్యం, సంక్షేమం, ఐ.టీ రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాల‌న్నారు. నియోజకవర్గాలకు జిల్లా స్థాయి అధికారులను నోడల్ ఆఫీసర్లుగా, మండల స్థాయిలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుని దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు ప్రణాళికా బద్దంగా కృషి చేయాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మమేకమై ప్రజలందరినీ భాగస్వాములు చేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.
ఈ సందర్భంగా జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవ కార్యక్రమం ఉంటుందని,
3న అన్ని రైతు వేదికల్లో రైతు దినోత్సవం జరుపాలని,
4న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సురక్షా దివస్,
5న విద్యుత్ విజయోత్సవం,
6న తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం,
7న సాగునీటి దినోత్సవం,
8న ఊరూరా చెరువుల పండుగ కారక్రమాలను నిర్వహించాలని వివరించారు.
9న తెలంగాణ సంక్షేమ సంబరాలను,
10న తెలంగాణ సుపరిపాలన దినోత్సవాన్ని,
11న సాహిత్య దినోత్సవం,
12న తెలంగాణ రన్,
13న మహిళా సంక్షేమ దినోత్సవం,
14న తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం,
15న పల్లె ప్రగతి దినోత్సవం,
16న పట్టణ ప్రగతి దినోత్సవం,
17న తెలంగాణ గిరిజనోత్సవం,
18న తెలంగాణ మంచినీళ్ల పండుగ,
19న తెలంగాణ హరితోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు.
20న తెలంగాణ విద్యా దినోత్సవంలో భాగంగా అన్ని కళాశాలలు, పాఠశాలల్లో జెండాను ఎగురవేయాలని, విద్యాలయాలను అందంగా ముస్తాబు చేయాలని, విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేయాలని, వ్యాసరచన, వకృత్వ, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించాలని, మన ఊరు -మన బడి పనులు పూర్తయిన చోట పాఠశాలలను ప్రజాప్రతినిధులచే ప్రారంభోత్సవాలు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
21 న తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలను అలంకరింపజేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేలా చూడాలన్నారు.
22 న అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధమైన త్రాగునీరు అందిస్తున్నామని ఆయా విషయం ప్రజలకు స్పష్టంగా తెలియచెప్పాలన్నారు. ఒకప్పుడు త్రాగునీటి కోసం మహిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్లు పాయి నీళ్ళు తెచ్చుకున్న సందర్భాలున్నాయని, నాడు నీటి కోసం గొడవలు జరిగి బిందెలు సొట్టలు పడేవని, కానీ నేడు మహిళల బుగ్గలకు సొట్టలు పడుతున్నాయే తప్ప బిందెలు లేవన్నారు.
హరితోత్సవంలో పాల్గొనే అటవీ, మున్సిపల్, గ్రామ పంచాయతీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. మొక్కలు నాటడంతో పాటు గతంలో నాటిన మొక్కల సంరక్షణ, ట్రీ గార్డ్స్ లేని మొక్కలకు ట్రీ గార్డ్స్ ఏర్పాటు, మొక్కలకు నీటి వసతులు తదితర చర్యలు తీసుకోవాల‌న్నారు. మన ఊరు- మన బడి పథకం ద్వారా జిల్లా లో ఎంపిక చేసి అభివృద్ది చేసుకున్న పాఠశాలకు సంబందించిన వివరాలతో కూడిన పట్టికలు ఏర్పాటు చేసి ఆయా స్కూల్ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేయాలని తద్వారా ఎక్కువ మంది విద్యార్థులు ఆకర్షితులై పాఠశాలలో చేరుతారని వివరించారు.

సమైక్య రాష్ట్రంలో వంచన, అనేక రకాల మోసాలకు గురైన తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం కోసం ఆరు దశాబ్దాలకు పైగా అలుపెరుగని పోరాటం చేసిందని మంత్రి గుర్తు చేశారు. ఉద్యమ నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మలిదశ తెలంగాణ పోరుకు శ్రీకారం చుట్టి, సబ్బండ వర్ణాలను ఏకం చేసి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ కలను సాకారం చేశారన్నారు. ఆ సమయంలో తెలంగాణ సమాజాన్ని అనేక మంది గేలి చేశారని, పరిపాలన చేతకాదని, అంధకారం అలుముకుంటుందని తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసేలా అవహేళన పర్చారని నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. అయితే అనేక మంది యువకులు, విద్యార్థులు త్యాగాల పునాదులపై, ప్రజలందరి పోరాటంతో సాధించుకున్న తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ తన దార్శనిక పాలనతో కేవలం తొమ్మిదేళ్ల స్వల్ప వ్యవధిలోనే యావత్ దేశం ఆశ్చర్యపోయే రీతిలో అనేక రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. కరోనా సంక్షోభ సమయంలో జాతీయ వృద్ధి రేటుతో ఇతర అనేక రాష్ట్రాల వృద్ధి రేటు దిగజారిందని, తెలంగాణ వృద్ధి రేటు మాత్రం నాలుగు శాతం పెరిగిందని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలనతో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు విశేషంగా లబ్ది చేకూరుతోంది, పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలు అనితర సాధ్యమైన అభివృద్ధిని సంతరించుకున్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా కేవలం మూడు శాతం జనాభా మాత్రమే కలిగి ఉన్న తెలంగాణకు జాతీయ స్థాయిలో వరుసబెట్టి 36 శాతం మేర వివిధ అభివృద్ధి అంశాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పలు అవార్డులు దక్కడం గర్వకారణమన్నారు. ఇలా పలు అవార్డులు వరిస్తుండడం తెలంగాణ ప్రభుత్వ సుపరిపాలన తీరుకు, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతకు నిదర్శనం అన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో సాగు రంగం ఐదింతలు అభివృద్ధి చెందిందన్నారు. 2014 వరకు కేవలం 16 లక్షల ఎకరాల్లో మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా వరి పంట సాగయ్యేదని, ప్రస్తుతం పంటల పెట్టుబడి, ఉచిత విద్యుత్, సాగు నీటి వసతి కల్పించడంతో 56 లక్షల ఎకరాల్లో వరి పంట పండిస్తున్నారని వివరించారు. వరి సాగులో పంజాబ్ ను సైతం అధిగమిస్తూ, దేశం మొత్తంలో యాభై శాతం ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రమే సాగు చేసే స్థాయికి ఎదిగిందన్నారు. వ్యవసాయం అనే కాకుండా ఏ రంగాన్ని చూసినా కనీసం మూడింతల అభివృద్ధి కనిపిస్తుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని, యాదాద్రి ఆలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్, ఐటి హబ్, కేబుల్ బ్రిడ్జీలు, ఫ్లై ఓవర్లు, రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ విగ్రహం, నూతన సచివాలయ నిర్మాణం, అమరవీరుల స్మారక చిహ్నం వంటి అనేక ప్రఖ్యాత కట్టడాలను అనతికాలంలోనే పూర్తి చేసుకోవడాన్ని చూసి ప్రపంచమే అబ్బురపడుతోందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ… దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంతం తరపున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి ఉత్సవాల విజయవంతానికి కృషి చేయాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రభుత్వ విప్ రేగ కాంతారావు, ఎమ్మేల్యేలు వనమా వేంకటేశ్వర రావు, హరిప్రియ నాయక్, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతా మాలక్ష్మీ, లైబ్రరీ చైర్మన్ దిండిగల రాజేందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement