Friday, April 19, 2024

ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ తో బిఆర్ఎస్ విమ‌ర్శ‌ల‌కు చెక్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఎన్నికల సమరశంఖారావాన్ని పూరించేందుకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న బీజేపీ తెలంగాణ నాయకత్వం క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై వరుస కార్యక్రమాలకు డిజైన్‌ చేసింది. రాజధాని హైదరాబాద్‌ నుంచి బూత్‌స్థాయి వరకు ప్రజా సమస్యలపై విస్తృతంగా పోరాటాలు నిర్వహించాలని ఇటీవల మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వంపై అదేపనిగా అధికార బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు త్వరలోనే పవర్‌పాయింట్‌ ప్రజెంటె షన్‌ కార్యక్రమాలను ప్రజాక్షేత్రంలో మండల, నియో జకవర్గ, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలని బీజేపీ తెలంగాణ నాయకత్వం నిర్ణయించింది. రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో గణాంకాలతో సహా వివరించి కేంద్ర ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ చేస్తున్న ఆరోపణలకు పుల్‌స్టాప్‌ పెట్టాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించేలా ప్రత్యేకంగా కార్యచరణను కమలనాథులు ఇప్పటికే సిద్ధం చేశారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దారిమళ్లిస్తున్నారని ఆరోపిస్తున్న బీజేపీ … త్వరలోనే సర్పంచ్‌లతో రాష్ట్రస్తాయిలో ఓ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.

ఎన్నికలకు కేవలం నెలల గడువే ఉండడంతో క్షేత్రస్థాయిలోకి పార్టీని తీసుకెళ్లడంపై కమలనాథులు ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటి వరకు ప్రజాగోస, ప్రజా సంగ్రామ యాత్ర పేర్లతో పాదయాత్ర నిర్వహించిన కాషాయ నేతలు ఇకపై బైక్‌ ర్యాలీలు, రథయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ప్రతి మండలానికి 1500 బైకులతో కూడిన బీజేపీ కార్యకర్తల బృందం పర్యటించనుంది. కేవలం 15 రోజుల్లోనే రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ప్రజాగోస- బీజేపీ భరోసా బైక్‌ ర్యాలీ యాత్రలను పూర్తి చేయనున్నారు.
నియోజకవర్గాల వారీగా ప్రభావవంతమైన నేతలు, మేథావులతో సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఎన్ని నిధులు కేటాయించింది… ఇంకా ఎన్ని కేటాయించబోతోంది వివరించబోతున్నారు. కేంద్ర
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలతో పెద్ద ఎత్తున కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయాలని , రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ పార్టీ చేయనంత స్థాయిలో కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఈ నెల 30న నిరుద్యోగుల సమస్యలపై ఇందిరాపార్కు వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. అదే సమయంలో
ఫిబ్రవరి 10 నుంచి 9వేల ప్రాంతాల్లో స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఇప్పటికే పార్లమెంటరీ ప్రబాస్‌ యోజన పేరుతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమాలకు ఎంపీ సెగ్మెంట్ల వారీగా కేంద్ర మంత్రులు హాజరవుతున్నారు. మోడీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నా రు. ప్రజాసమస్యలపై ఉద్యమిస్తూనే పార్టీని సంస్థాగ తంగా బలోపేతం చేయడంపైనా బీజేపీ దృష్టి సారిం చింది. ప్రతి 30 మంది ఓటర్లకు పన్నా ప్రముఖుల నియామకం, బూత్‌ కమిటీల నిర్మాణం తదితర కార్య క్రమాలను వేగంగా పూర్తి చేయనున్నారు. రాబోయే రోజుల్లో ఎస్సీఎస్టీ, బీసీలు, ఇతర వెనుకబడిన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement