హైదరాబాద్, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ అధిష్టానం తెలంగాణను టార్గెట్ చేసింది. రానున్న అసెంబ్లిd ఎన్నికల్లో మిషన్-90 లక్ష్యాన్ని అధిగమించేందుకు కార్యాచర ణను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికార పగ్గాలు చేతికి దక్కించుకునేలా బీజేపీ కదం తొక్కు తోంది. అంశం ఏదైనా కాషాయ పార్టీ అధిష్టానం తెలంగాణ నేతలను ముందుకు దూకేలా దిశానిర్దేశం చేస్తోంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే ముగ్గురు బీజేపీ అగ్రనేతలు తెలంగాణ పర్యటనకు వస్తున్నారంటే బీజేపీ తెలంగాణపై ఏ స్థాయిలో ఫోకస్ పెట్టిందో అర్థం చేసుకోవచ్చు.
దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణనే కమలం వికసించేందుకు అనువైన కొలను అని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్న్యాయం తామే నని, ఢిల్లి టూ తెలంగాణ గల్లి అంటూ అలజడి పెంచుతోంది. హస్తిన పెద్దలు వరుసగా ఏప్రిల్ నెలలో తెలంగాణ ల్యాండ్ కానున్నారు. తెలంగాణ ప్రజలపై వాగ్దానాలు కురిపిస్తూనే అధికార బీఆర్ఎస్ వైఫల్యాలపై వాగ్భాణాలను సంధించాలని నిర్ణయించారు. తెలంగాణలో వరుస పర్యటనలు చేయనున్న నేతలు అగ్రనేతలంటే ఆషామాషీ నేతలు కాదు ఏకంగా ప్రధాని మోడీతోపాటు బీజె పీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా త్రయం తెలంగాణపై ముప్పెట పర్యటనలు చేయనున్నారు. రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతమే లక్ష్యంగా వీరి పర్యటనలు కొనసాగనున్నాయి.
జేపీ నడ్డా, ప్రధాని మోడీ, అమిత్ షా వరుస పర్యటనలు…
ఈ నెల 31న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలం గాణ పర్యటనకు రానున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఆయన పర్యటిస్తారు. రాష్ట్ర పార్టీకి చెందిన ముఖ్యనేతలతో కీలక సమావేశం నిర్వహిస్తారు. అసెంబ్లి ఎన్నికలు సమీపిస్తున్న వేళ నడ్డా తెలంగాణ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న అంశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో… ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 8న ఆయన హైదరాబాద్కు రానున్నారని బీజేపీ వర్గాలకు సమాచారం అందింది. ప్రభుత్వ అధికారిక కార్యక్ర మాలతోపాటు పార్టీ కార్యక్రమాల్లోనూ ప్రధాని పాల్గొంటా రని తెలుస్తోంది. ఏప్రిల్ 8న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీ కరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. రూ.700కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు కొనసాగను న్నాయి. అనంతరం తిరుపతి-సికింద్రాబాద్ మధ్యన వందే భారత్ రైలును ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత తెలంగాణ బీజేపీ పార్టీ కార్యక్రమాల్లోనూ ప్రధాని పాల్గొంటారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై హైదరాబాద్ బీజేపీ నేతలతో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రధాని మోడీతో జింఖానా గ్రౌండ్స్లో బహిరంగ సభను నిర్వహిం చాలని నిర్ణయించారు. ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ కోసం సన్నాహక సమావేశాన్ని కిషన్రెడ్డి నిర్వహించారు. జన సమీకరణపై బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయబోతున్నారు. ప్రధాని మోడీ పర్యటన అనంతరం ఏప్రిల్ మూడో వారం, లేదా ఏప్రిల్ నెల చివరలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కర్ణాటక అసెంబ్లిd ఎన్నికలపై ఫోకస్ పెట్టిన అమిత్ షా ఆ తర్వాత ఆయన ప్రధానంగా దృష్టిపెట్టేది తెలంగాణ మీదనేనని నేతలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లి ఎన్నికలు ముగిసే వరకు అమిత్ షా రాష్ట్రంలోనే ఉండేలా ఏర్పాట్లు జరుగుతు న్నాయి. ఇందుకు ఆయన ఇక్కడే ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటూ తరుచూ తెలంగాణ రాజకీయ పరిణామాలపై ఫోకస్ పెడతారని ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ రెండు పార్టీల మధ్య ఎన్నడూ లేనంతగా రాజకీయ పరిస్థితులు రసవత్తరంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటుండడంతో తెలంగాణలో రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ను ఇరుకునపెడుతోంది. ఈ తరుణంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణ పర్యటనకు రానుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.