Tuesday, April 16, 2024

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ.. తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

శాయంపేట : తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రకు పాల్పడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, పాదయాత్ర కన్వీనర్ తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. విభజన హమీలైన బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీపీఐ చేపట్టిన ప్రజాపోరు యాత్ర ఏడో రోజు శుక్రవారం శాయంపేటలో కొనసాగింది. అంతకు ముందు పరకాల పట్టణం నుండి బయలుదేరి పెద్ద కోడెపాక, మాందారి పేటల మీదుగా శాయంపేటకు చేరుకున్నది. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతుందన్నారు. రాష్ట్రానికి రావలసిన నిధులను, ప్రాజెక్టులను, పరిశ్రమలను ఆపివేసిందన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయకుండా తొమ్మిదేళ్లు కాలయాపన చేసిందన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసమే సీపీఐ పోరాడుతున్నదని, ఇతర పార్టీల మాదిరిగా కుర్చీ కోసం కాదన్నారు.

విభజన హామీలతో పాటు పోడు భూముల రైతులకు పట్టాలు ఇవ్వాలని, ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు వేసుకుని నివసిస్తున్న పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలని, గనుల ప్రైవేటీకరణ నిలిపివేసి, సింగరేణి ఆధ్వర్యంలో మైనింగ్ నిర్వహించాలని, హైదరాబాద్ నుండి జనగామ వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఈ పాదయాత్రలో తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతో పాటు సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బి.విజయ సారథి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, షేక్ బాషుమియా, జనసేవాదళ్ రాష్ట్ర కన్వినర్ పంజాల రమేష్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎన్.అశోక్ స్టాలిన్, మండ సదా లక్ష్మీ, నాయకులు కొట్టెపాక రవి, ల్యాదెళ్ల శరత్, బత్తిని సదానందం, అనుకారి అశోక్, పైండ్ల క్రాంతికుమార్, దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement