ప్రభాన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. జిల్లా కేంద్రంలో జరిగిన దశాబ్ది వేడుకలకు రాష్ట్ర రైతు బంధు సమన్వయ సమితి అద్యక్షులు, ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ప్రధాన కూడలిలో వున్న అమరవీరుల స్థూపం వద్దకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి, జెడ్పీ చైర్మన్, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి లతో కలిసి వెళ్ళి అమవీరుల స్థూపానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు..
జై తెలంగాణ అంటూ వారి త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సంద్భంగా స్వరాష్ట్రంలో పదేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి శాఖల వారీగా వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని, అదనపు కలెక్టర్లు దివాకర, ఉమాశంకర్ ప్రసాద్, జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.